64 ఏళ్ల తర్వాత టీమిండియా తొలిసారి..

20 Oct, 2019 13:08 IST|Sakshi

రాంచీ:  దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భాగంగా రెండో టెస్టులో విజయం సాధించిన తర్వాత సిరీస్‌ను కైవసం చేసుకుని టీమిండియా ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. స‍్వదేశంలో వరుసగా 11 టెస్టు సిరీస్‌లు గెలిచిన రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఈ క‍్రమంలోనే స్వదేశంలో ఆసీస్‌ సాధించిన 10 వరుస టెస్టు సిరీస్‌ విజయాల్ని బద్ధలు కొట్టింది. కాగా, సఫారీలతో మూడో టెస్టులో రోహిత్‌ శర్మ డబుల్‌ సెంచరీ సాధించడం ద్వారా భారత జట్టు సుదీర్ఘం విరామం తర్వాత అరుదైన ఘనతను లిఖించుకుంది. భారత్‌ ఒక్క సిరీస్‌లో మూడు డబుల్‌ సెంచరీలు సాధించిన ఘనతను 64 ఏళ్ల తర్వాత తొలిసారి నమోదు చేసింది.

1955-56 సీజన్‌లో న్యూజిలాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లో మూడు డబుల్‌ సెంచరీలు నమోదయ్యాయి. ఆ సిరీస్‌లో వినోద్‌ మన్కడ్‌ రెండు డబుల్‌ సెంచరీలు సాధించగా, పాలీ ఉమ్ర్‌గర్‌ ద్విశతకం చేశాడు. ఆ సిరీస్‌ తర్వాత భారత్‌కు ఒకే సిరీస్‌లో మూడు డబుల్‌ సెంచరీలు రావడం ఇదే తొలిసారి.  సఫారీలతో తొలి టెస్టులో మయాంక్‌ అగర్వాల్‌ డబుల్‌ సెంచరీ చేయగా, రెండో టెస్టులో విరాట్‌ కోహ్లి ద్విశతకం సాధించాడు. తాజా టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్‌ డబుల్‌ సెంచరీతో మెరిశాడు. తద్వారా మూడు వరుస టెస్టుల్లోనూ భారత్‌ ఆటగాళ్లు డబుల్‌ సెంచరీలు సాధించినట్లయ్యింది. ఇలా రావడం భారత్‌కు ఓవరాల్‌గా రెండోసారి మాత్రమే.

మరిన్ని వార్తలు