న్యూజిలాండ్‌దే రెండో టి20 

4 Nov, 2019 03:49 IST|Sakshi

 21 పరుగులతో ఓడిన ఇంగ్లండ్‌

వెల్లింగ్టన్‌: తొలి మ్యాచ్‌లో ఎదురైన పరాజయం నుంచి న్యూజిలాండ్‌ జట్టు తేరుకుంది. రెండో టి20 మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకొని ఇంగ్లండ్‌పై 21 పరుగుల తేడాతో గెలిచింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. ఆదివారం జరిగిన ఈ రెండో టి20 మ్యాచ్‌లో తొలుత న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 176 పరుగులు సాధించింది. గప్టిల్‌ (28 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు),  నీషమ్‌ (22 బంతుల్లో 42; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), గ్రాండ్‌హోమ్‌ (12 బంతుల్లో 28; ఫోర్, 3 సిక్స్‌లు), రాస్‌ టేలర్‌ (24 బంతుల్లో 28; 2 ఫోర్లు, సిక్స్‌) ధాటిగా ఆడారు.

ఇంగ్లండ్‌ బౌలర్లలో జోర్డాన్‌ మూడు వికెట్లు, స్యామ్‌ కరన్‌ రెండు వికెట్లు పడగొట్టారు. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 19.5 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌటైంది. మోర్గాన్‌ (17 బంతుల్లో 32; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), మలాన్‌ (29 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), జోర్డాన్‌ (19 బంతుల్లో 36; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడినా కీలకదశలో అవుటవ్వడంతో ఇంగ్లండ్‌ లక్ష్యానికి దూరంగా నిలిచింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సాన్‌ట్నెర్‌ (3/25) రాణించాడు. ఈ మ్యాచ్‌లో కివీస్‌ ఫీల్డర్‌ గ్రాండ్‌హోమ్‌ నాలుగు క్యాచ్‌లు తీసుకోగా... ఇంగ్లండ్‌ ఫీల్డర్లు ఆరు క్యాచ్‌లను నేలపాలు చేశారు.

మరిన్ని వార్తలు