బంగ్లాదేశ్తో రెండో టెస్టు
చిట్టగాంగ్: బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా నిలకడగా ఆడుతోంది. మ్యాచ్ రెండో రోజు మంగళవారం ఆట ముగిసే సమయానికి ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (170 బంతుల్లో 88 బ్యాటింగ్; 4 ఫోర్లు), పీటర్ హ్యాండ్స్కోంబ్ (113 బంతుల్లో 69 బ్యాటింగ్; 5 ఫోర్లు) మూడో వికెట్కు ఇప్పటికే అభేద్యంగా 127 పరుగులు జోడించారు. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (94 బంతుల్లో 58; 8 ఫోర్లు) కూడా అర్ధసెంచరీ సాధించాడు.
అంతకు ముందు ఓవర్నైట్ స్కోరు 253/6తో ఆట కొనసాగించిన బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 305 పరుగులకు ఆలౌటైంది. నాథన్ లయోన్ 94 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టడం విశేషం. ప్రస్తుతం ఆసీస్ మరో 80 పరుగులు వెనుకబడి ఉంది.
బస్సుపై రాళ్ల దాడి!
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై కొందరు బంగ్లాదేశ్ అభిమానులు రాళ్లతో దాడి చేశారు. సోమవారం తొలి రోజు ఆట ముగించుకొని జట్టు హోటల్కు వెనుదిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఎవరికీ గాయాలు కాకపోయినా... తాజా ఘటన నేపథ్యంలో బంగ్లా అధికారులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.