‘ఫ్రీగా మ్యాచ్‌ను తిలకించేందుకు కాదు’

13 Oct, 2019 09:36 IST|Sakshi

పుణే: భారత దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అభిమానుల అతిక్రమణపై, భద్రతా సిబ్బందిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడో రోజు ఆటలో ఓ ప్రేక్షకుడు మైదానంలోకి దూసుకొచ్చాడు. రోహిత్‌ కాళ్లు మొక్కేందుకు యత్నించి ‘హిట్‌మ్యాన్‌’ను కింద పడేశాడు. టీవీ వ్యాఖ్యాతగా ఉన్న సన్నీ దీనిపై తీవ్రంగా స్పందించారు. ‘భద్రతా బలగాలు అప్రమత్తంగా లేకపోవడం వల్లే ఈ సమస్య. వాళ్లు భద్రతను మరిచి మ్యాచ్‌ను చూస్తుంటారు. వాళ్లున్నది అనుకోని ఘటనల్ని నియంత్రించేందుకు తప్ప మ్యాచ్‌ను ఫ్రీగా తిలకించేందుకు కాదు’ అని అన్నారు.

ప్రేక్షకుల అతి చేష్టల వల్ల ఆటగాడు గాయపడితే పరిస్థితి ఏంటని, గతంలో ఇలాంటివి జరిగాయని, ఇక ముందు జరుగకుండా చూసుకోవాలని సూచించారు. భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటనలో ఇది మూడో ఉదంతం. వైజాగ్‌ టెస్టులో ఒకరు కోహ్లితో సెల్ఫీ దిగేందుకు దూసుకొచ్చాడు. మొహాలీలో జరిగిన రెండో టి20లో అభిమానులు మైదానంలోకి రావడంతో రెండు సార్లు ఆటకు అంతరాయం ఏర్పడింది.  

>
మరిన్ని వార్తలు