ఎలాంటి ఆందోళన అవసరం లేదు: ఐసీసీ

23 Feb, 2019 12:58 IST|Sakshi

దుబాయ్‌: ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలతో సంబంధాలను తెంచుకోవాలని కోరుతూ భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) రాసిన లేఖపై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) స్పందించింది.  శుక్రవారం సమావేశమైన సీఓఏ.. పాక్‌తో మ్యాచ్‌ ప్రస్తావన లేకుండా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలతో క్రికెట్‌ సంబంధాలను నిలిపివేయాలని లేఖ రాసింది. ఈ క్రమంలోనే వరల్డ్‌కప్‌లో తమ ఆటగాళ్లకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఐసీసీకి విన్నవించింది.

దీనిపై స్పందించిన ఐసీసీ.. ఆటగాళ్ల భద్రతే తమ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేసింది. ఈ విషయంలో బీసీసీఐ ఎలాంటి ఆందోళన చెందాల్సి అవసరం లేదని పేర్కొంది. ‘బీసీసీఐ రాసిన లేఖ మాకు చేరింది. వరల్డ్‌కప్‌లో ఆటగాళ్ల భద్రతే తమ మొదటి ప్రాధాన్యత. దీనికి ఎప్పుడూ పెద్ద పీటే వేస్తాం. మార్చి 2వ తేదీన జరుగనున్న ఐసీసీ సభ్యుల సమావేశంలో బీసీసీఐ రాసిన లేఖపై పూర్తి స్థాయిలో చర్చిస్తాం. కచ్చితంగా బీసీసీఐకి భద్రతాపరమైన హామీ ఇస్తాం. వరల్డ్‌కప్‌లో మా ఏర్పాట్లుతో బీసీసీఐని సంతృప్తి పరుస్తాం’ అని ఐసీసీ చైర్మన్‌ శశాంక్‌ మనోహర్‌ తెలిపారు.

నిర్ణయాన్ని వారికే వదిలేశాం: కోహ్లి

వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌తో ఆడాలా.. వద్దా అనే విషయాన్ని బీసీసీఐతో పాటు ప్రభుత్వానికే వదిలేశామని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియాతో ఆదివారం విశాఖలో తొలి టీ20లో తలపడనున్న నేపథ్యంలో కోహ్లి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. వరల్డ్‌కప్‌లో పాక్‌తో ఆడటంపై బోర్డు, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో దానికి కట్టుబడి ఉంటాం. వారు తీసుకునే నిర్ణయం ఏదైనా గౌరవిస్తాం. పుల్వామా దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్‌ జవాన్లకు జట్టు తరఫున ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం’ అని అన్నాడు.

ఇక్కడ చదవండి: ప్రభుత్వ నిర్ణయమే శిరోధార్యం

>
మరిన్ని వార్తలు