సెహ్వాగ్‌, గంభీర్‌ కొత్త ఇన్నింగ్స్‌

26 Jul, 2018 12:47 IST|Sakshi

న్యూఢిల్లీ:  టీమిండియా హిట్ ఓపెనింగ్ జోడీల్లో వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ జోడీ ఒకటి. ఈ ఇద్దరూ టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించారు. తాజాగా వీరిద్దరూ కలిసి సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించనునన్నారు. అయితే, ఈ సెకండ్ ఇన్నింగ్స్ మైదానం బయట కావడం విశేషం.

డీడీసీఏ క్రికెట్ కమిటీలో తాజాగా ఈ ఇద్దరికీ చోటు కల్పిస్తూ ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ) నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఇప్పటికే ఈ క్రికెట్ కమిటీలో మాజీ క్రికెటర్లు ఆకాశ్ చోప్రా, రాహుల్ సంఘ్వితో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఢిల్లీ క్రికెట్‌లో కోచ్‌లు, సెలక్టర్ల ఎంపిక, ఇతర అంశాలను ఈ క్రికెట్ కమిటీ చూసుకుంటుంది. లోధా కమిటీ నిబంధనల ప్రకారమే ఈ క్రికెట్ కమిటీ నియామకాలు జరిపినట్లు డీడీసీఏ అధ్యక్షుడు రజత్ శర్మ వెల్లడించారు. అయితే, గంభీర్, సెహ్వాగ్ విషయంలో పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం తెరపైకి వచ్చింది.

గంభీర్ ఇప్పటికీ క్రికెట్ ఆడుతున్నాడు. అలాంటి వ్యక్తి సెలక్టర్లను ఎలా నియమిస్తాడు? అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీంతో పాటు గంభీర్ ఇప్పటికే డీడీసీఏలో ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నాడు. ఈ క్రికెట్ కమిటీలో గంభీర్‌కు ఓ ముఖ్యమైన పదవి కట్టబెట్టనున్నారు.  డీడీసీఏలో ప్రభుత్వ నామినీగా కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు