‘పాక్‌పై ఓడిపోవటమా?.. ముచ్చటే లేదు’

14 Jun, 2019 21:41 IST|Sakshi

మాంచెస్టర్‌ : ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవడంతో పాకిస్తాన్‌తో జరగబోయే మ్యాచ్‌పై టీమిండియా దృష్టి పెట్టింది. ఇప్పటికే దాయాది పాక్‌ పని పట్టేందుకు కోహ్లి సేన వ్యూహాలు రచిస్తోంది. ఇక ఆసియా కప్‌ అనంతరం సుదీర్ఘ విరామం తర్వాత ఇరుజట్లు తొలిసారి తలపడనుండటంతో యావత్‌ క్రికెట్‌ ప్రపంచం ఈ మ్యాచ్‌ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంది. అయితే అభిమానులకే కాదు మాజీ క్రికెటర్లకు కూడా ప్రపంచకప్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారని చర్చ చేపడుతున్నారు.
తాజాగా భారత మాజీ దిగ్గజ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌తో పాక్‌ మాజీ స్పీడస్టర్‌ షోయబ్‌ అక్తర్‌ తన యూట్యూబ్‌ చానల్‌లో ఈ మ్యాచ్‌పై చర్చిస్తారు.  ‘భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో టాస్‌, పరిస్థితులు,ఆటగాళ్ల ఫామ్‌, అన్నింటిని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఏ జట్టు విజేతగా నిలుస్తుంది?’ అని అక్తర్‌ ప్రశ్నించాడు. దీనికి సెహ్వాగ్‌ సమాధానంగా..‘ఏది ఏమైనా ఆదివారం(జూన్‌ 16)జరగబోయే మ్యాచ్‌లో భారత్‌పై పాక్‌ గెలుస్తుందని ఎలాంటి నమ్మకం లేదు’అంటూ పేర్కొన్నాడు.

అయితే పాక్‌ టాస్‌ గెలిస్తే మ్యాచ్‌ కూడా గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అక్తర్‌ వాదించాడు. ఇక ప్రపంచకప్‌ గెలిచే సత్తా టీమిండియా, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌ జట్లకు మాత్రమే ఉందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో పాక్‌పై టీమిండియా ఓడిపోయే ముచ్చటే లేదని భారత అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ కోసం మాంచెస్టర్‌కు ఇరజట్ల అభిమానులు చేరుకున్నారు. బ్లాక్‌లో టికెట్లు కొనుక్కొని మరీ మ్యాచ్‌ చూసేందుకు సిద్దపడుతున్నారు. సెహ్వాగ్‌, అక్తర్‌ల పూర్తి సంభాషణ కింది వీడియోలో చూడండి.

చదవండి:
‘ధావన్‌ గొప్ప పోరాటయోధుడు’
‘టాస్‌ గెలిచి స్విమ్మింగ్‌ ఎంచుకున్న భారత్‌’

మరిన్ని వార్తలు