సాత్విక్‌ ‘డబుల్‌’

8 Feb, 2017 00:10 IST|Sakshi
సాత్విక్‌ ‘డబుల్‌’

సింగిల్స్‌ చాంప్స్‌ రితూపర్ణ, సౌరభ్‌ వర్మ
పట్నా: జాతీయ సీనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో తెలుగు క్రీడాకారులు మెరిశారు. మంగళవారం ముగిసిన ఈ టోర్నమెంట్‌లో డబుల్స్‌ విభాగాలలో ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారుడు సాత్విక్‌ సాయిరాజ్‌ రెండు టైటిల్స్‌ను సాధించగా... తెలంగాణ క్రీడాకారిణి రితూపర్ణ దాస్‌ మహిళల సింగిల్స్‌ చాంపియన్‌గా అవతరించింది. పెట్రోలియం స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ బోర్డుకు (పీఎస్‌పీబీ) ప్రాతినిధ్యం వహిస్తున్న మధ్యప్రదేశ్‌ ఆటగాడు సౌరభ్‌ వర్మ పురుషుల సింగిల్స్‌లో రెండోసారి విజేతగా నిలిచాడు.

పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) ద్వయం 21–17, 16–21, 21–14తో నందగోపాల్‌ (కాగ్‌)–సాన్యమ్‌ శుక్లా (ఎయిరిండియా) జంటపై గెలిచింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఎయిరిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్లేయర్‌ కె. మనీషాతో జతకట్టిన సాత్విక్‌ ఫైనల్లో 21–14, 21–18తో వెంకట్‌ గౌరవ్‌ ప్రసాద్‌–జూహీ దేవాంగన్‌ (చత్తీస్‌గఢ్‌)పై విజయం సాధించాడు.

 మహిళల సింగిల్స్‌ ఫైనల్లో హైదరాబాద్‌లో స్థిరపడిన బెంగాలీ అమ్మాయి, రెండో సీడ్‌ రితూపర్ణ దాస్‌ 21–12, 21–14తో తొమ్మిదో సీడ్‌ రేష్మా కార్తీక్‌ (ఎయిరిండియా)పై గెలిచి తొలిసారి ఈ ప్రతిష్టాత్మక టైటిల్‌ను దక్కించుకుంది. పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో 2011 చాంపియన్‌ సౌరభ్‌ వర్మ 21–13, 21–12తో ప్రపంచ జూనియర్‌ నంబర్‌వన్‌ లక్ష్య సేన్‌ (ఉత్తరాఖండ్‌)పై విజయం సాధించాడు.

మరిన్ని వార్తలు