రైల్వేస్‌కు మూడో విజయం 

6 Dec, 2018 01:41 IST|Sakshi

రాణించిన వేద, అరుంధతి, పూనమ్‌

సాక్షి, గుంటూరు వెస్ట్‌: బీసీసీఐ సీనియర్‌ మహిళల వన్డే క్రికెట్‌ టోర్నమెంట్‌లో రైల్వేస్‌ జట్టు వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్‌’ నమోదు చేసింది. మహారాష్ట్రతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రైల్వేస్‌ 52 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన రైల్వేస్‌ 50 ఓవర్లలో 6 వికెట్లకు 231 పరుగులు చేసింది. వేద కృష్ణమూర్తి (80 బంతుల్లో 80; 8 ఫోర్లు, సిక్స్‌), హైదరాబాద్‌ అమ్మాయి అరుంధతి రెడ్డి (27 బంతుల్లో 48 నాటౌట్‌; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడారు. కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ 29 బంతుల్లో 11 పరుగులు చేసింది.

ఆరో వికెట్‌కు వేద, అరుంధతి కలిసి ఆరు ఓవర్లలో 61 పరుగులు జోడించడం విశేషం. 232 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మహారాష్ట్ర 50 ఓవర్లలో 7 వికెట్లకు 179 పరుగులు చేసి ఓడిపోయింది. రైల్వేస్‌ బౌలర్లలో పూనమ్‌ యాదవ్‌ 46 పరుగులిచ్చి 3 వికెట్లు... ఏక్తా బిష్త్‌ 28 పరుగులిచ్చి 2 వికెట్లు తీశారు. సౌరాష్ట్రతో జరిగిన మరో మ్యాచ్‌లో పంజాబ్‌ 91 పరుగుల తేడాతో... గోవాతో జరిగిన మ్యాచ్‌లో చత్తీస్‌గఢ్‌ 26 పరుగుల తేడాతో విజయం సాధించాయి.   

మరిన్ని వార్తలు