అంపైర్‌ అబద్ధాల కోరు.. దొంగ: సెరెనా

9 Sep, 2018 14:20 IST|Sakshi

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్‌లో తాను మోసానికి పాల్పడలేదని అమెరికా స్టార్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి, నల్ల కలువ సెరెనా విలియమ్స్ అన్నారు. తుది పోరులో  సెరెనా 2-6, 4-6  తేడాతో జపాన్‌ క్రీడాకారిణి ఒసాకా చేతిలో పరాజయం పాలైంది. ఫలితంగా ఒసాకా టైటిల్‌ గెలిచి కొత్త చరిత్ర సృష్టించింది. 

అయితే రెండో సెట్‌లో సెరెనా నిబంధనలు ఉల్లంఘించి చైర్‌ అంపైర్‌ ఆగ్రహానికి గురైంది. తొలి సెట్‌ను కోల్పోయిన సెరెనా.. రెండో సెట్‌ జరుగుతున్న సమయంలో కోచ్‌ సాయం తీసుకోవడంపై చైర్‌ అంపైర్‌ హెచ్చరించాడు. దీంతో వాగ్వాదానికి దిగిన సెరెనా.. ‘నువ్వు అబద్ధాలకోరు, దొంగ’ అంటూ చైర్‌ అంపైర్‌ను నిందించి ఆగ్రహంతో రాకెట్‌ను నేలకేసి కొట్టింది. ఆట నిబంధనలు ఉల్లంఘించడంతో చైర్‌ అంపైర్‌ ఆమెకు ఒక పాయింట్‌ జరిమానా విధించాడు. తర్వాత మ్యాచ్‌ రెఫరీని పిలిచి ఛైర్‌అంపైర్‌పై ఫిర్యాదు చేసి అతను క్షమాపణ చెప్పాలని సెరెనా డిమాండ్‌ చేసింది. అనంతరం సెరెనా రెండో సెట్‌ను కూడా కోల్పోవడంతో ఒసాకా టైటిల్‌ విజేతగా నిలిచింది.

ఆట అనంతరం సెరెనా మాట్లాడుతూ .. ఆట మధ్యలో కోచ్‌ సాయం తీసుకోలేదు. అంపైర్‌ కావాలనే నా పాయింట్‌లో కోత విధించాడు. క్రీడల్లో పురుష ఆటగాళ్లతో పోల్చితే.. మహిళలపై వివక్ష ఉంటుందన్న నా నమ్మకాన్ని ఈ ఘటన బలోపేతం చేసింది. పురుష ఆటగాళ్ల పట్ల చైర్‌ అంపైర్లు ఎలా ప్రవర్తిస్తారో నేను చూశాను. ఇక్కడ నేను మహిళల హక్కుల కోసం, వారి సమానత్వం కోసం పోరాడుతున్నాను’ అని సెరెనా అన్నారు. మహిళలు ఎలా వివక్షకు గురువుతున్నారో వివరిస్తూ..  గతవారం ఫ్రెంచ్‌ క్రీడాకారిణి అలిజ్‌ కార్నెట్‌ ఎండ వేడిమి కారణంగా కోర్టులోనే షర్ట్‌ విప్పేసిన ఘటనలో ఆమెను చైర్‌ అంపైర్‌ హెచ్చరించిన ఘటనను సెరెనా ఉదహరించారు. 

>
మరిన్ని వార్తలు