మెరిసిన షఫాలీ, స్మృతి

11 Nov, 2019 04:27 IST|Sakshi

తొలి టి20లో విండీస్‌పై భారత మహిళల జట్టు ఘనవిజయం

భారత్‌ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అర్ధ సెంచరీ సాధించిన పిన్న వయస్కురాలిగా షఫాలీ గుర్తింపు

30 ఏళ్లుగా సచిన్‌ పేరిట ఉన్న రికార్డు తెరమరుగు  

కెరీర్‌లో ఐదో టి20 మ్యాచ్‌ ఆడిన హరియాణా అమ్మాయి షఫాలీ వర్మ ఈ మ్యాచ్‌లో అరుదైన ఘనత సాధించింది. 30 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకోవడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌ తరఫున అర్ధ సెంచరీ సాధించిన పిన్న వయస్కురాలిగా ఆమె గుర్తింపు పొందింది. షఫాలీ 15 ఏళ్ల 285 రోజుల వయసులో ఈ ఘనత సాధించి... 30 ఏళ్లుగా సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలుకట్టింది. 1989లో సచిన్‌ 16 ఏళ్ల 214 రోజుల ప్రాయంలో పాకిస్తాన్‌తో ఫైసలాబాద్‌లో జరిగిన రెండో టెస్టులో 59 పరుగులు సాధించి కెరీర్‌లో తొలి అర్ధ సెంచరీ చేశాడు.   

గ్రాస్‌ ఐలెట్‌: వన్డే సిరీస్‌లో కనబరిచిన జోరును టి20 ఫార్మాట్‌లోనూ భారత మహిళల జట్టు కొనసాగించింది. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో టీమిండియా 84 పరుగుల ఆధిక్యంతో భారీ విజయం నమోదు చేసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిరీ్ణత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 184 పరుగులు సాధించింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (49 బంతుల్లో 73; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), స్మృతి మంధాన (46 బంతుల్లో 67; 11 ఫోర్లు) వీరవిహారం చేశారు. తొలి వికెట్‌కు 15.3 ఓవర్లలో 143 పరుగులు జోడించారు. టి20 ఫార్మాట్‌లో ఏ వికెట్‌కైనా భారత్‌కిదే అత్యుత్త మ భాగస్వామ్యం కావడం విశేషం.

2013లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తిరుష్‌ కామిని, పూనమ్‌ రౌత్‌ నమోదు చేసిన 130 పరుగుల భాగస్వామ్యం రికార్డును షఫాలీ, స్మృతి బద్దలు కొట్టారు. షఫాలీ, స్మృతి ఐదు బంతుల వ్యవధిలో అవుటవ్వడంతో విండీస్‌ ఊపిరి పీల్చుకుంది. వీరిద్దరు అవుటయ్యాక కెపె్టన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (13 బంతుల్లో 20; 3 ఫోర్లు), వేద కృష్ణమూర్తి (7 బంతుల్లో 15 నాటౌట్‌; 2 ఫోర్లు) దూకుడుగా ఆడటంతో భారత్‌ భారీ స్కోరు చేసింది. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 101 పరుగుల చేసి ఓడిపోయింది. షెమైన్‌ క్యాంప్‌బెల్‌ (33; 2 ఫోర్లు, సిక్స్‌) మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో శిఖా పాండే (2/22), రాధా యాదవ్‌ (2/10), పూనమ్‌ యాదవ్‌ (2/24) రాణించారు.  

మరిన్ని వార్తలు