ఆ బ్యాట్‌ను అఫ్రిది సొంతం చేసుకున్నాడు..

16 May, 2020 12:11 IST|Sakshi

రహీమ్‌ బ్యాట్‌ను భారీ ధరకు కొనుగోలు

కరాచీ:  బంగ్లాదేశ్‌ వికెట్‌ కీపర్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ వేలంలో ఉంచిన బ్యాట్‌ను పాకిస్తాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ షాహిద్‌ అఫ్రిది కొనుగోలు చేశాడు. కరోనా వైరస్‌ నివారణలో భాగంగా చేయూతనివ్వడానికి ముందుకొచ్చిన రహీమ్‌.. శ్రీలంకపై 2013లో డబుల్‌ సెంచరీ చేసిన బ్యాట్‌ను గత నెల్లో వేలానికి పెట్టాడు. అయితే దీన్ని అఫ్రిది తన ఫౌండేషన్‌ కోసం కొనుగోలు చేశాడు. ఈ బ్యాట్‌కు 20 వేల డాలర్లు చెల్లించి అఫ్రిది సొంతం చేసుకున్నాడు.  దీనిపై ముష్ఫికర్‌ రహీమ్‌ ఆనందం వ్యక్తం చేశాడు. ‘అఫ్రిది తన ఫౌండేషన్‌లో ఉంచడం కోసం నా బ్యాట్‌ను తీసుకోవడం గొప్పగా భావిస్తున్నా. మాకు అఫ్రిది మద్దతుగా నిలిచినందుకు చాలా థాంక్స్‌. గత వారం చాలా మంది వేలంలో పోటీ పడ్డారు. ఈ పోటీ ఇలా కొనసాగుతూనే వచ్చింది. ('ఆ మాటలు నా మనుసు నుంచి వచ్చాయి')

అయితే అఫ్రిది బ్యాట్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించడంతో వేలం రద్దయ్యింది. వేలంలో బ్యాట్‌ను ఉంచిన విషయంపై నాకు వ్యక్తిగతంగా అఫ్రిది ఫోన్‌ చేసి మాట్లాడాడు. మే 13వ తేదీన బ్యాట్‌ను కొంటున్నట్లు ఒక ఆఫర్‌ లెటర్‌ను పంపాడు. 20 వేల యూఎస్‌ డాలర్లకు బ్యాట్‌ను కొన్నాడు. ఇది బంగ్లాదేశ్‌ కరెన్సీలో 16.8 లక్షలు ఉంటుంది’ అని రహీమ్‌ తెలిపాడు. ఈ మేరకు అఫ్రిది మాట్లాడిన వీడియోను కూడా ముష్ఫికర్‌ రహీమ్‌ తన ట్వీటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు. ‘నువ్వు ఒక గొప్ప పని చేశావ్‌. ఇది కేవలం రియల్‌ హీరోలు మాత్రమే చేస్తారు. ఈ కఠిన సమయంలో ప్రతీ ఒక్కరూ తమకు తోచిన సాయాల్ని చేసుకుని ముందుకు సాగాలి’ అని అఫ్రిది పేర్కొన్నాడు.(టీవీ సిరీస్‌లో నటించింది కోహ్లీనా!)

మరిన్ని వార్తలు