భారత్‌ను ఓడిస్తాం : షకీబ్‌

25 Jun, 2019 11:25 IST|Sakshi

లండన్‌ : ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న బంగ్లాదేశ్‌.. ఎన్నడు లేనివిధంగా టాప్‌–5లోకి దూసుకువచ్చి సెమీస్‌ రేసులో నిలిచింది. సోమవారం అప్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లా కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో 62 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక తమ తదుపరి మ్యాచ్‌లను మాజీ చాంపియన్స్‌ భారత్‌, పాకిస్తాన్‌లతో ఆడనుంది. ప్రస్తుతం 7 మ్యాచ్‌లు ఆడిన బంగ్లా 3 గెలిచి 7 పాయింట్లతో 5 స్థానంలో నిలిచింది. బంగ్లా తర్వాతే మాజీ చాంపియన్లు శ్రీలంక, పాక్, వెస్టిండీస్‌లు కొనసాగడం విశేషం. స్పూర్తిదాయకమైన బంగ్లా ఆటతో యావత్‌ క్రికెట్‌ ప్రపంచం నివ్వెరపోతుంది. ముఖ్యంగా షకీబ్‌ అల్‌ హసన్‌, ముష్ఫికర్‌ రహీమ్‌ల ఆట అందరిని ఆకట్టుకుంటోంది. ఇక వారు ఓడిన మూడు మ్యాచ్‌ల్లో కూడా చివరి బంతికి వారు కనబర్చిన పోరాటపటిమ ఔరా అనిపించింది.

ఈ నేపథ్యంలో జూలై 2న భారత్‌తో బంగ్లాతలపడనుంది. దాదాపు వారంకు పైగా ఆ జట్టుకు విశ్రాంతి లభించింది. అప్గాన్‌తో విజయానంతరం షకీబ్‌ అల్‌ హసన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘భారత్‌తో జరిగే మ్యాచ్‌ మాకు చాలా ముఖ్యం. టైటిల్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన జట్టు భారత్‌. వారిని ఓడించడం అంత సులువు కాదు. కానీ మేం గట్టి పోటీనిస్తాం. భారత్‌లో దిగ్గజశ్రేణి ఆటగాళ్లున్నారు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించే సత్తా వారికుంది. మేం మా సాయశక్తుల పోరాడుతాం. భారత్‌ను ఓడించే సత్తా మాకు ఉంది. ఈ విషయంలో మా జట్టుపై నాకు పూర్తి విశ్వాసం ఉంది.’ అని షకీబ్‌ ధీమా వ్యక్తం చేశాడు. ఒకే ప్రపంచకప్‌లో 400 కంటే ఎక్కువ పరుగులు చేయడంతోపాటు పది వికెట్లు కూడా తీసిన తొలి ప్లేయర్‌గా షకీబ్‌ రికార్డు నమోదు చేశాడు. అంతేకాకుండా ప్రపంచకప్‌ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేయడంతోపాటు ఐదు వికెట్లు తీసిన రెండో స్పిన్నర్‌గా గుర్తింపు పొందాడు. 2011 ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ (5/31; 50 నాటౌట్‌) ఈ ఘనత సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో షకీబ్‌ ఆరు మ్యాచ్‌లు ఆడి 476 పరుగులు చేసి, 10 వికెట్లు తీశాడు. 
చదవండి: బంగ్లా పైపైకి...

>
మరిన్ని వార్తలు