‘మా సీనియర్‌ క్రికెటర్లకు సిగ్గుండాలి’

6 Nov, 2018 12:34 IST|Sakshi

ఆంటిగ్వా: టీమిండియాతో ద్వైపాక్షిక సిరీస్‌కు పలువురు వెస్టిండీస్‌ సీనియర్‌ క్రికెటర్లు గైర్హాజరీ కావడంతో ఆ జట్టు మాజీ ఆటగాడు కార్ల్‌ హూపర్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ఒక పటిష్టమైన జట్టును ఢీకొట్టేందుకు వెళ్లేటప్పుడు సీనియర్‌ క్రికెటర్లు డుమ్మా కొట్టడం అనేది చాలా సిగ్గుచేటన్నాడు. చాలామందికి విండీస్‌ తరపున ఆడాలనే ఉద్దేశం లేకపోవడంతోనే వారు ఏదొక వంకతో దూరమవుతున్నారంటూ విమర్శించాడు.

‘వెస్టిండీస్ తరపున ఆడాలనే ఉద్దేశమే వారికి లేదు. కొద్దిరోజులుగా వారు వ్యవహరిస్తున్న తీరుతోనే అది స్పష్టమవుతోంది. దానికి వారు సిగ్గుపడాలి. సీనియర్లు జట్టులో లేకపోవడంతో టీ20ల్లో వెస్టిండీస్‌ని ఓడించడం భారత్‌కి చాలా సులువు. ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లకి అనుభవం తక్కువ. వారు కుదురుకునేందుకు కొంత సమయం పడుతుంది. కుర్రాళ్లలో ప్రతిభ ఉంది.. కానీ.. నిలకడగా మాత్రం రాణించలేకపోతున్నారు' అని కార్ల్ హూపర్ పేర్కొన్నాడు.

వెస్టిండీస్‌ జట్టు భారత్‌తో వన్డే సిరీస్ ఆడే సమయంలో క్రిస్‌గేల్ అఫ్గానిస్థాన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతున్నాడు. మూడేళ్లుగా వెస్టిండీస్ బోర్డు, సీనియర్ క్రికెటర్ల మధ్య జీతాల విషయమై విభేదాలు కొనసాగుతుండటంతో.. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు వారు ఆసక్తి కనబర్చడం లేదు. ఈ క్రమంలో సీనియర్ క్రికెటర్లకి అసలు వెస్టిండీస్ జాతీయ జట్టుకు ఆడాలనే శ్రద్ధే లేదంటూ హూపర్ తాజాగా ధ్వజమెత్తాడు.

భారత్‌తో సిరీస్‌కు గేల్‌ దూరం

మరిన్ని వార్తలు