ఫిట్‌నెస్‌ పరీక్షలో షమీ ఫెయిల్‌ 

12 Jun, 2018 00:47 IST|Sakshi

అఫ్గానిస్తాన్‌తో టెస్టుకు దూరం

బౌలర్‌ నవ్‌దీప్‌ సైనికి పిలుపు   

న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో వివాదాలతో సతమతమవుతోన్న భారత పేస్‌ బౌలర్‌ మొహమ్మద్‌ షమీ యో యో ఫిట్‌నెస్‌ పరీక్షలో ఫెయిలయ్యాడు. ఫలితంగా అఫ్గానిస్తాన్‌తో ఈనెల 14 నుంచి జరగనున్న ఏకైక టెస్టులో పాల్గొనే భారత జట్టు నుంచి అతడిని తప్పించారు. షమీ స్థానంలో ఢిల్లీ ఫాస్ట్‌ బౌలర్‌ నవ్‌దీప్‌ సైనిని తొలిసారి జాతీయ జట్టులోకి ఎంపిక చేశారు. 25 ఏళ్ల సైని ఇప్పటివరకు 31 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 96 వికెట్లు తీశాడు.

‘బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో నిర్వహించిన ఫిట్‌నెస్‌ పరీక్షలో షమీ నెగ్గలేకపోయాడు. దాంతో అతని స్థానంలో ఆలిండియా సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ నవ్‌దీప్‌ సైనిని ఎంపిక చేసింది’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. షమీతోపాటు భారత ‘ఎ’ జట్టు సభ్యుడు సంజూ శామ్సన్‌ కూడా యో యో ఫిట్‌నెస్‌ పరీక్షలో ఫెయిలయ్యాడని అతని స్థానంలో భారత అండర్‌–19 మాజీ కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ను ఎంపిక చేశామని తెలిపింది.   

మరిన్ని వార్తలు