కంటతడి పెట్టినా లైవ్‌లో పరువు తీశారు

20 Feb, 2018 14:22 IST|Sakshi
నో సెయాన్‌-యెయాంగ్‌

సియోల్‌ : దక్షిణ కొరియా స్కేటర్లపై అభిమానులు భగ్గుమంటున్నారు. సెమీ-ఫైనల్‌ క్వాలిఫైయింగ్‌ రేసులో ఓడిపోయి వింటర్‌ ఒలంపిక్స్‌ నుంచి టీమ్‌ నిష్క్రమించింది. అయితే వారు ఓటమి గురించి ఆటగాళ్లపై మండిపడటం లేదు. టీమ్‌ సభ్యురాలైన నో సెయాన్‌-యెయాంగ్‌పై మిగతా సభ్యులు లైవ్‌లోనే విమర్శలు చేసినందుకు...

సోమవారం 500 మీటర్ల క్వాలిఫైయింగ్‌ రేసులో కిమ్‌ బో-రెమ్‌ నేతృత్వంలో బృందం పాల్గొంది. అయితే రేసులో కిమ్‌, మరో ప్లేయర్‌ పార్క్‌ జీ-వూ లు దూసుకుపోగా.. నో సెయాన్ మాత్రం వెనకబడిపోయింది. చివరకు రేసులో సౌత్‌ కొరియా టీమ్‌ ఓటమి పాలైంది. దీనిని జీర్ణించుకోలేక నో సెయాన్‌ వెక్కి వెక్కి ఏడ్చేసింది. అయితే టీమ్‌ సభ్యులు మాత్రం ఆమెపై కనికరం చూపలేదు. కిమ్‌, పార్క్‌లు  ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ...  ‘మేం మా ఆట సరిగ్గానే ఆడాం. కానీ, నో సెయాన్‌ విఫలమైంది. చాలా చెత్త ప్రదర్శన ఇచ్చింది. ఆమె మూలంగానే ఓటమి చెందాం’ అంటూ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై చూసిన దక్షిణ కొరియా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటలో గెలుపొటములు సహజమని.. అంత మాత్రానికి తోటి క్రీడాకారిణిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సబబు కాదని వారంటున్నారు.

అంతేకాదు కిమ్‌, పార్క్‌లను తక్షణమే నిషేధం విధించాలంటూ ఓ పిటిషన్‌ను రూపొందించారు. దానిని అధ్యక్ష కార్యాలయ అధికారిక సైట్‌కు పొందుపరచగా... దీనిపై ఇప్పటిదాకా దాదాపు 2,50,000 మంది సంతకాలు చేశారు. అయితే వారిద్దరిపై నిషేధం విధించే అంశంపై మాత్రం దక్షిణ కొరియా క్రీడా శాఖ, ఒలంపిక్స్‌ కమిటీ స్పందించలేదు.

మరిన్ని వార్తలు