బాస్‌ గుర్తులేడా వార్న్‌.. 

14 Mar, 2020 15:12 IST|Sakshi

న్యూఢిల్లీ:  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) వాయిదా పడటంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ నెటిజన్ల విమర్శలకు గురయ్యాడు.  ‘ఐపీఎల్‌ వాయిదా పడిందా.. ఇది నిజమేనా.. ఇప్పుడే ఈ సమాచారం తెలుసుకున్నా’ అని నిన్న ట్వీటర్‌లో అనుమానం వ్యక్తం చేశాడు వార్న్‌. ఇంతవరకూ బాగానే ఉంది. ఎందుకంటే ఐపీఎల్‌ వాయిదా పడుతుందని ఎవరూ అనుకోలేదు. చివరకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ సైతం మొన‍్నటి వరకూ ఐపీఎల్‌ జరిగి తీరుతుందని తెగేసి మరీ చెప్పాడు. కాగా, కరోనా వైరస్‌ను మహమ్మారిగా డబ్యూహెచ్‌వో ప్రకటించిన తరుణంలో అన్ని దేశాలు అప‍్రమత్తమయ్యాయి. అనవసరపు తలనొప్పులు తెచ్చుకునే కంటే ముందుస్తు జాగ్రత్తలు చేపట్టాలని నిర్ణయించాయి. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం సైతం క్రీడలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రేక్షకులు లేకుండా క్రికెట్‌ మ్యాచ్‌లు, మిగతా టోర్నీలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరొకవైపు ఐపీఎల్‌కు రాబోయే విదేశీ ఆటగాళ్ల వీసాలపై ఆంక్షలు పెట్టింది. దాంతో ఐపీఎల్‌ను వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేస్తూ శనివారం నిర్ణయం తీసుకున్నారు. (ఐపీఎల్‌ ఆలస్యం)

బీసీసీఐ బాస్‌ గుర్తులేడా..
దీనిపై షేన్‌ వార్న్‌ ఆశ్చర్యంతో కూడిన ట్వీట్‌ చేశాడు. దానిలో భాగంగా విరాట్‌ కోహ్లి, మైకేల్‌ వాన్‌, కెవిన్‌ పీటర్సన్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, రాజస్తాన్‌ రాయల్స్‌, స్టార్‌స్పోర్ట్స్‌ ఇండియా, అజింక్యా రహానే, రికీ పాంటింగ్‌ ఇలా అందర్నీ ట్యాగ్‌ చేశాడు. చివరకు కుల్దీప్‌ యాదవ్‌ను కూడా వార్న్‌ ట్యాగ్‌ చేశాడు. అయితే ఇక్కడ బీసీసీఐ బాస్‌, తన సమకాలీన క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీని వార్న్‌ మరిచాడు. దాంతో నెటిజన్లు సెటైర్లకు దిగారు. ‘ బాస్‌ను మరిచావా వార్న్‌. ఎందుకిలా’ అంటూ ఒక అభిమాని ప్రశ్నించగా, ‘ వార్న్‌ ఏంటీ నువ్వు చిన్న పిల్లాడిలా.. కుల్దీప్‌ను అడిగావు.. కానీ గంగూలీని అడగలేదు ఎందుకు’ అని మరొకరు ప్రశ్నించారు. ‘ వార్న్‌.. నీకు న్యూస్‌ చూడటం రాదా.. అంతమందికి ట్యాగ్‌ చేశావ్‌’ అని మరొక అభిమాని సెటైర్‌ వేశాడు. (అందుకే మంజ్రేకర్‌పై వేటు పడిందా?)

>
మరిన్ని వార్తలు