వారికి థాంక్స్‌ చెబితే సరిపోదు: వాట్సన్‌

24 Apr, 2019 17:14 IST|Sakshi

చెన్నై: ఐపీఎల్‌లో భాగంగా మంగళవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. వాట్సన్‌ (96; 53బంతుల్లో 9ఫోర్లు, 6 సిక్సర్లు) పరుగులు చేసి జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. అయితే ఇక్కడ తనపై నమ్మకం ఉంచి జట్టులో కొనసాగిస్తున్న జట్టు యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపాడు. ప్రధానంగా కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌, కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని తనపై ఎంతో నమ్మకం ఉంచడంతోనే తుది జట్టులో పదే పదే అవకాశాలు ఇస్తూ వచ్చారన్నాడు. తనపై నమ్మకం ఉంచిన వారిద్దరికీ థాంక్స్‌ చెబితే సరిపోదని వాట్సన్‌ పేర్కొన్నాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తప్ప వేరే జట్టులో ఉండి ఉంటే తనను ఎప్పుడో డ్రెస్సింగ్‌ రూమ్‌కి పరిమితం చేసేవారని ఒకింత ఉద్వేగానికి లోనయ్యాడు.

‘చెన్నై కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌, కెప్టెన్‌ ధోని నామీద ఎంతో నమ్మకం ఉంచారు. నేను జట్టుకు ఇంకా ఎన్నో పరుగులు బాకీ ఉన్నాను. గతంలో బీబీఎల్‌, పీఎస్‌లోనూ రాణించాను. కానీ, ఐపీఎల్‌ సీజన్‌ ప్రారంభం నుంచి అంచనాలు అందుకోలేకపోయాను. అయితే, జట్టు నామీద నమ్మకం ఉంచింనందుకు ఆ జట్టుకు రుణపడి ఉంటాను. ఫ్లెమింగ్‌, ధోనిలకు థాంక్స్‌ చెప్పి సరిపెట్టడం చాలా చిన్నదే అవుతుంది’ అని వాట్సన్‌ పేర్కొన్నాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ 173 పరుగులు చేసింది.  లక్ష్య ఛేదనలో డుప్లెసిస్‌ వికెట్ కోల్పోవడంతో కష్టాల్లో పడ్డ చెన్నైని వాట్సన్‌ తన అద్భుత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. ఈ సీజన్‌లో మొదటిసారి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు వాట్సన్‌ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా సాధించిన వాట్సన్‌.. సన్‌రైజర్స్‌పై చెలరేగి ఆడి తన బ్యాటింగ్‌ పవర్‌ చూపించాడు.

మరిన్ని వార్తలు