'బ్రో.. 12వ స్థానంలో వచ్చినా సెంచరీ చేస్తావ్‌'

13 Feb, 2020 11:26 IST|Sakshi

ఆక్లాండ్‌ : కేఎల్ రాహల్‌ ఆటతీరుపై టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రశంసల జల్లు కురిపించాడు. కివీస్‌తో జరిగిన ఆఖరి వన్డేలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి రాహుల్ అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్న విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో భారత్‌ ఓడినా రాహుల్‌ ఇన్నింగ్స్‌ మాత్రం అందరిని ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ధావన్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రాహుల్‌ ప్రదర్శనను కొనియాడాడు. 'కివీస్‌తో జరిగిన ఆఖరి వన్డేలో అద్భుతమైన సెంచరీ సాధించావ్ బ్రో. నీ కెరీర్‌ ఇప్పుడు పీక్‌ స్టేజ్‌లో ఉంది. ఇలానే నీ విధ్వంసాన్ని కొనసాగిస్తే 12వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా సెంచరీ సాధిస్తావ్' అనే క్యాప్షన్‌తో రాహుల్ సెంచరీ ఫొటోను షేర్ చేశాడు. ధావన్‌ చేసిన పోస్ట్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 'నిజమే.. రాహుల్ ఆర్డర్‌తో సంబంధం లేకుండా చెలరేగుతున్నాడంటూ' అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. (చదవండి: కాగితం, కత్తెర, బండ?)


ఇక ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో భాగంగా బెంగుళూరులో జరిగిన వన్డేలో ధావన్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన విషయం తెలిసిందే. దీంతో న్యూజిలాండ్ టూర్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఇక ఐదు టీ20ల సిరీస్‌ను 5-0 తో క్లీన్ స్వీప్ చేసిన భారత్, వన్డే సిరీస్‌లో మాత్రం 0-3తో వైట్‌వాష్ అయింది. కాగా కేఎల్‌ రాహుల్‌ ప్రస్తుతం విధ్వంసకర బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. కివీస్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లలో రాహుల్ తన కీపింగ్, బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. టీ20 సిరీస్‌లో ఓపెనర్‌గా బరిలోకిదిగిన రాహుల్.. టాప్ స్కోరర్‌గా నిలిచి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్నాడు. ఇక మూడు వన్డేల సిరీస్‌లో మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా ఐదో స్థానంలో బరిలోకి దిగిన రాహుల్‌ తొలి వన్డేలో 88 పరుగులు, మూడో వన్డేలో సెంచరీతో చెలరేగాడు. కాగా కివీస్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టు మ్యాచ్‌ ఫిబ్రవరి 21న వెల్లింగ్టన్‌ వేదికగా జరగనుంది. (చదవండి: సెంచరీతో రాహుల్‌ రికార్డుల మోత..!)

మరిన్ని వార్తలు