20 పరుగుల దూరంలో ధావన్‌

6 Nov, 2018 11:36 IST|Sakshi

లక్నో: ఇటీవల కాలంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌.. అంతర్జాతీయ టీ20ల్లో వెయ్యి పరుగుల క్లబ్‌లో చేరేందుకు స్వల్ప దూరంలో నిలిచాడు. ప్రస్తుతం అంతర్జాతీయ టీ20ల్లో 980 పరుగులు చేసిన ధావన్‌.. మరో 20 పరుగులు చేస్తే వెయ్యి పరుగుల మైలురాయిని అందుకుంటాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా విండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో మూడు పరుగులు చేసి నిరాశపరిచిన ధావన్‌.. ఈరోజు(మంగళవారం) జరుగనున్న రెండో టీ20ల్లో వెయ్యి పరుగుల మార్కును చేరే అవకాశం ఉంది.

ఇప్పటివరకూ అంతర్జాతీయ టీ20ల్లో వెయ్యి పరుగులు సాధించిన భారత ఆటగాళ్లలో విరాట్‌ కోహ్లి, సురేశ్‌ రైనా, ఎంఎస్‌ ధోని, యువరాజ్‌ సింగ్‌, రోహిత్‌ శర్మలు మాత్రమే ఉన్నారు. ఇక భారత తరపున వేగవంతంగా వెయ్యి పరుగులు సాధించిన ఆటగాళ్లలో కోహ్లి ముందువరుసలో ఉన్నాడు. ఓవరాల్‌గా కోహ్లి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లి ఫాస్టెస్‌ రికార్డును రెండు రోజుల క్రితం పాకిస్తాన్‌ క్రికెటర్‌ బాబర్‌ అజమ్‌ అధిగమించిన సంగతి తెలిసిందే. కోహ్లి 27 ఇన్నింగ్స్‌ల్లో వేగవంతంగా వెయ్యి పరుగులు సాధిస్తే, బాబర్‌ అజమ్‌ 26 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ ఘనతను అందుకున్నాడు.

మరిన్ని వార్తలు