ఫ్యాన్స్‌ కోరిక మేరకు.. ధావన్‌

8 Sep, 2018 13:04 IST|Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌తో జరగుతున్న ఐదో టెస్టు తొలి రోజు బౌలర్లు రాణించడంతో టీమిండియా ఆధిపత్యం కనబర్చింది. టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ రాణించడంతో ఆతిథ్య జట్టు భారీ స్కోర్‌ చేసేలా కనిపించింది. కానీ, చివర్లో  బౌలర్లు పుంజుకోవడంతో తొలి రోజు టీమిండియానే పైచేయి సాధించింది. ఒక్క వికెట్‌ నష్టానికి 132 పరుగులు చేసి పటిష్టస్థితిలో ఉన్నట్టు కనిపించిన ఇంగ్లండ్.. అనంతరం 50 పరుగుల వ్యవధిలో ఆరు వికెట్లు కోల్పోయింది. బౌలర్ల ప్రదర్శన చూసి భారత అభిమానులు తెగ సంబరపడిపోయారు. ఈ తరుణంలో బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న టీమిండియా డాషింగ్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ను భాంగ్రా నృత్యం చేయమని అభిమానులు కోరారు.

ఫ్యాన్స్‌ను అలరించడానికి టీమిండియా గబ్బర్‌సింగ్‌ ఎప్పుడూ ముందుంటాడన్న విషయం తెలిసిందే. దీంతో భారత అభిమానుల కోరిక మేరకు భాంగ్రా నృత్యం చేసి అందరినీ అలరించాడు. ధావన్‌ను అనుసరిస్తూ అభిమానులు కూడా నిలబడి నృత్యం చేశారు. ఇక ఆ సమయంలో కామెంటేటర్‌గా వ్యవహిరస్తున్న భారత సీనియర్‌ ఆటగాడు హర్భజన్‌ సింగ్‌ను ధావన్‌తో పాటు నృత్యం చేయాల్సిందింగా ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ డేవిడ్‌ లాయిడ్‌ కోరాడు. ధావన్‌ నృత్యానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది.

మరిన్ని వార్తలు