గాయం తగ్గలేదు.. అతను ఆడటం డౌటే..!

10 Dec, 2019 15:28 IST|Sakshi

న్యూఢిల్లీ : గాయం కారణంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు దూరమైన శిఖర్‌ ధావన్‌ వన్డే సిరీస్‌కు కూడా అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. ముస్తాక్‌ అలీ టోర్నీలో ఆడుతున్న క్రమంలో ధావన్‌ మోకాలికి గాయం అయిన సంగతి తెలిసిందే. దీంతో విండీస్‌తో టీ20 సిరీస్‌కు సెలెక్టర్లు అతన్ని పక్కన పెట్టారు. ధావన్‌ స్థానంలో వికెట్‌ కీపర్‌ సంజూ శాంసన్‌ను ఎంపిక చేశారు. అయితే, ఇప్పటి వరకు జరిగిన రెండు టీ20ల్లో అతనికి ఆడే అవకాశం రాలేదు. తుది జట్టులో వికెట్‌కీపర్‌ పంత్‌ను ఆడించడంతో శాంసన్‌ రిజర్వు బెంచ్‌కే పరిమితయ్యాడు.

ఇక వన్డే సిరీస్‌ నాటికి ధావన్‌ అందుబాటులో ఉంటాడనుకున్నప్పటికీ అతని గాయం ఇంకా తగ్గలేదని బెంగుళూర్‌ మిర్రర్‌ అనే వార్తా సంస్థ వెల్లడించింది. ధావన్‌ స్థానంలో జట్టులోకి ఎవరిని తీసుకునేది బీసీసీఐ త్వరలో నిర్ణయించనుంది. విండీస్‌తో మూడు మ్యాచ్‌లో సిరిస్‌లో భాగంగా తొలి వన్డే డిసెంబర్‌ 15న జరుగనుంది. ఇదిలాఉండగా.. ధావన్‌ స్థానంలో మరోసారి శాంసన్‌నే జట్టులోకి తీసుకోవచ్చని సమాచారం. ఒకవేళ శాంసన్‌ను పక్కనపెడితే శుభ్‌మన్‌ గిల్‌, మయాంక్‌ అగర్వాల్‌లలో ఒకరికి ఛాన్స్‌ రావొచ్చని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు