శిఖర్‌ ధావన్‌ తీవ్ర కసరత్తు

14 Jun, 2019 11:35 IST|Sakshi

లండన్‌ : రెక్కలతో కాదు... సంకల్పంతో ఎగురుతానని గాయంపై స్పందించిన టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ అన్నట్లుగానే తీవ్ర కసరత్తు చేస్తున్నాడు. గాయం నుంచి కోలుకుంటాననే ఆత్మవిశ్వాసం కనబరుస్తున్నాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌ సందర్భంగా ధావన్‌ ఎడమ బొటన వేలికి గాయమైన విషయం తెలిసిందే. గాయంతోనే ఆ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన గబ్బర్‌కు మ్యాచ్‌ అనంతరం పరీక్షలు నిర్వహించగా బొటన వేలు విరిగిందని మూడు వారాల విశ్రాంతి అవసరమని తేలింది. దీంతో ప్రపంచకప్‌లోని ఇతర మ్యాచ్‌లకు గబ్బర్‌ దూరయ్యాడు. ఈ నేపథ్యంలో బుధవారం తన గాయంపై శిఖర్‌ ధావన్‌ తన ప్రతిస్పందనను కవితా రూపంలో వెల్లడించాడు.  ప్రఖ్యాత ఉర్దూ రచయిత రాహత్‌ ఇందోరీ రాసిన పంక్తిని అతను ట్విటర్‌ ద్వారా పంచుకున్నాడు.  తాజాగా జట్టులోకి రావాడానికి జిమ్‌లో తాను చేస్తున్న కసరత్తులను ట్విటర్‌ ద్వారా పంచుకున్నాడు.

‘ప్రస్తుత పరిస్థితులు ఓ పీడకలగా మిగిలిపోవచ్చు లేకుంటే తిరిగి కోలుకోవడానికి అవకాశం ఇవ్వచ్చు. నేను కోలుకోవాలని సందేశాలను పంపించిని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అంటూ క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. చేతికి పట్టీ వేసుకొని మరి గబ్బర్‌ కసరత్తు చేయడం అభిమానులను ఆకట్టుకుంటోంది. గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ వారు కామెంట్‌ చేస్తున్నారు. ఇక భారత్‌-న్యూజిలాండ్‌తో గురువారం జరగాల్సిన మ్యాచ్‌ వర్షంతో రద్దైన విషయం తెలిసిందే. దీంతో ఇరు జట్లకు చెరోపాయింట్‌ లభించింది. 

ఈ ఫలితంపై కెప్టెన్‌ విరాట్‌కోహ్లి స్పందిస్తూ.. ‘కివీస్‌తో మ్యాచ్‌ రద్దు సరైన నిర్ణయమే. విజయాలు సాధించి ఉన్నాం కాబట్టి చెరో పాయింట్‌ దక్కడం ఏమంత ఇబ్బందికరమేం కాదు. పాక్‌తో ఆదివారం మ్యాచ్‌ గురించి ఆలోచిస్తున్నాం. మా ప్రణాళికలు మాకున్నాయి. మైదానంలో వాటిని అమలు చేయాలి. ధావన్‌ చేతికి కొన్ని వారాల పాటు ప్లాస్టర్‌ తప్పనిసరి. లీగ్‌ మ్యాచ్‌ల చివరి దశలో లేదా సెమీస్‌కు అతడు అందుబాటులోకి వస్తాడు. అతడు తిరిగి ఆడాలని కోరుకుంటున్నా’ అని కోహ్లి పేర్కొన్నాడు.

చదవండి: ‘రెక్కలతో కాదు... సంకల్పంతో ఎగురుతా’

మరిన్ని వార్తలు