కోల్ కతా: న్యూజిలాండ్ తో ఇక్కడ ఈడెన్ గార్డెన్ లో జరుగుతున్న రెండో టెస్టు తుది జట్టులోకి వచ్చిన ఓపెనర్ శిఖర్ ధవన్ వైఫల్యంపై ట్విట్టర్లో సెటైర్ల వర్షం కురుస్తోంది. కేఎల్ రాహుల్ గాయంతో జట్టులో స్థానం సంపాదించిన శిఖర్ తన బాధ్యతను మరచి పేలవంగా నిష్క్రమించాడంటూ నెటిజన్లు విమర్శలు ఎక్కుపెట్టారు. న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ బౌలింగ్లో బంతిని బ్యాక్ ఫుట్ లో ఆడబోయి బౌల్డ్ అయ్యాడు.
ఒక పరుగు మాత్రమే చేసిన శిఖర్ సమయ పరిమితికి తాను ముగ్దుడ్ని అయ్యానంటూ ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు. ఒకవేళ శిఖర్ పై జీవిత కథ తీస్తే ఈ విషయాన్ని కచ్చితంగా చూపించాలన్నాడు. మరొక ట్వీట్ లో పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ చేతికి వేసుకునే గ్లోవ్స్తో శిఖర్ ధవన్ గ్లోవ్స్ను పోల్చుతూ ప్రశ్నలు సంధించారు. వీరిద్దరూ వేసుకునే గ్లోవ్స్కు సరైన కారణం అనేది ఉండదంటూ అందుకు మరొకరు బదులిచ్చారు. అయితే శిఖర్ తొందరగా అవుట్ కావడానికి కారణం ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'ఎంఎస్ ధోని: ద అన్ టోల్డ్ స్టోరీ' సినిమా బ్లాక్ టికెట్లు అమ్మడానికంటూ మరొక నెటిజన్ ట్వీట్ చేశాడు.