క్వార్టర్స్‌లో రష్మిక, శివాని

11 Jan, 2018 10:31 IST|Sakshi

ఐటీఎఫ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌  

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) జూనియర్స్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయిలు శ్రీవల్లి రష్మిక, శివాని అమినేనిలకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సింగిల్స్‌ విభాగంలో క్వార్టర్స్‌కు చేరిన వీరిద్దరూ... డబుల్స్‌ కేటగిరీలో ఓటమి పాలయ్యారు. ఢిల్లీలో బుధవారం జరిగిన బాలికల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో శ్రీవల్లి రష్మిక (భారత్‌) 6–4, 6–4తో సొనాషి భట్నాగర్‌ (భారత్‌)పై గెలుపొందింది. మరో ప్రిక్వార్టర్స్‌లో ఐదోసీడ్‌ శివాని (భారత్‌) 6–2, 6–2తో జూలి బెల్‌గ్రావెర్‌ (నెదర్లాండ్స్‌)ను ఓడించి ముందంజ వేసింది. మరోవైపు డబుల్స్‌ క్వార్టర్స్‌లో శివాని అమినేని (భారత్‌)–డోరోతేజ జొక్సోవిక్‌ (సెర్బియా) జంట 3–6, 4–6తో ఆంచిసా చాంట (థాయ్‌లాండ్‌)–హొ కి జెన్ని వాంగ్‌ (హాంకాంగ్‌) జోడీ చేతిలో ఓటమి పాలైంది.

మరో మ్యాచ్‌లో శ్రీవల్లి రష్మిక (భారత్‌)–యునా ఒహాషి (జపాన్‌) ద్వయం 3–6, 6–3, 9–11తో సోఫియా–మార్గక్స్‌ (ఫ్రాన్స్‌) జంట చేతిలో పరాజయం చవిచూసింది. బాలుర డబుల్స్‌ విభాగంలో రిత్విక్‌ చౌదరి బొల్లిపల్లి సెమీస్‌కు చేరుకోగా, మాచెర్ల తీర్థ శశాంక్‌ జంట క్వార్టర్స్‌లో నిష్క్రమించింది. క్వార్టర్స్‌లో రిత్విక్‌ చౌదరి–అభిమన్యు రెడ్డి (భారత్‌) జంట 6–3, 6–4తో సుశాంత్‌–రిథమ్‌ మల్హోత్రా (భారత్‌) జోడీపై గెలిచింది. అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్స్‌లో రిత్విక్‌–అభిమన్యు (భారత్‌) జంట 6–4, 6–1తో నాలుగో డాంగ్‌ జు కిమ్‌–జోంగ్‌ పార్క్‌ (కొరియా) జోడికి షాకిచ్చింది. మరో క్వార్టర్స్‌లో తీర్థ శశాంక్‌–పీయూశ్‌ సురేంద్ర (భారత్‌) జంట 4–6, 2–6తో లూయిస్‌ హెర్మన్‌–గౌథియర్‌ (బెల్జియం) జోడీ చేతిలో ఓటమి పాలైంది. అంతకుముందు ప్రిక్వార్టర్స్‌లో తీర్థ శశాంక్‌ జోడి 7–5, 7–5తో నాథోలిన్‌ కాల్విన్‌ గోల్మి (భారత్‌)–నికిత్‌ రెడ్డి (అమెరికా) జోడీపై గెలుపొందింది.  

మరిన్ని వార్తలు