ఇస్లామాబాద్ : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. మాజీ పేసర్ షోయబ్ అక్తర్కు రెండు ముఖ్యమైన పదవులు కట్టబెడుతున్నట్లు బోర్డు శనివారం ప్రకటించింది. పీసీబీ బ్రాండ్అంబాసిడర్తోపాటు సలహాదారు పదవుల్లో అక్తర్ను నియమించారు.
‘‘క్రికెట్ సంబంధాల విషయంలో పీసీబీ అధ్యక్షుడికి సలహాదారుగానూ, అదే సమయంలో పీసీబీకి బ్రాండ్ అంబాసిడర్గానూ అక్తర్ నియమితులయ్యారు’’అని చైర్మన్ నజమ్ సేథీ తెలిపారు. నిర్ణయాన్ని స్వాగతించిన అక్తర్.. తన 14 ఏళ్ల కెరీర్లో దేశానికి ఏవిధంగా సేవలు చేశానో, అదే స్ఫూర్తిని కొనసాగిస్తానని చెప్పుకొచ్చారు.
నాడు విరోధులు.. నేడు ఆత్మీయులు : కెరీర్ ఆసాంతం క్రికెట్ బోర్డుతో ఘర్షణపడుతూ వచ్చిన అక్తర్.. రిటైర్మెంట్ తర్వాత కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సేథీ చైర్మన్గా ఉంటే పాక్ క్రికెట్కు కష్టాలు తప్పవనీ అన్నారు. ఒక దశలో బద్ధ విరోధులుగా వ్యవహరించిన సేథీ, అక్తర్లు.. ఇప్పుడు ఆత్మీయులుగా మారిపోవడం క్రీడా,రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.