అతడు టీమిండియా ఎక్స్‌ ఫ్యాక్టర్‌: అక్తర్‌

3 Feb, 2020 12:27 IST|Sakshi

కరాచీ: న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో టీమిండియా గెలుస్తుందని తాను అనుకోలేదని పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ అభిప్రాయపడ్డాడు. తొలి 10 ఓవర్ల వరకూ మ్యాచ్‌ కివీస్‌ చేతుల్లోనే ఉండగా, ఆ తర్వాతే భారత్‌ తిరిగి పుంజుకుందన్నాడు. దీనికి కారణంగా టీమిండియా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రానే అని స్పష్టం చేశాడు. భారత్‌ రేసులో నిలిచి మ్యాచ్‌ను గెలిచిందంటే అందుకు బుమ్రా బౌలింగే కారణమని విశ్లేషించాడు. నిన్నటి మ్యాచ్‌లో బుమ్రా నాలుగు ఓవర్లు బౌలింగ్‌ వేయడంతో పాటు ఒక మెయిడిన్‌ కూడా వేసి 12 పరుగులే ఇచ్చాడు.  కీలక సమయంలో మూడు వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. (ఇక్కడ చదవండి; బుమ్రా నయా వరల్డ్‌ రికార్డు)

దీన్ని ప్రధానంగా ప్రస్తావించిన అక్తర్‌.. భారత క్రికెట్‌ జట్టుకు బుమ్రా ఒక ఎక్స్‌ ఫ్యాక్టర్‌ అని కొనియాడాడు. బుమ్రా ఎంతటి నాణ్యమైన బౌలరో మరొకసారి నిరూపించుకున్నాడని ప్రశంసించాడు. ‘ బుమ్రా బౌలింగ్‌ చూడండి.. నిజంగా అసాధారణం. 3 వికెట్లు..12 పరుగులు ఇదొక అద్భుతమైన బౌలింగ్‌. టీమిండియా మ్యాచ్‌ గెలిచిందంటే అందుకు బుమ్రానే కారణం. గాయం తర్వాత బుమ్రా గాడిలో పడటానికి రెండు నుంచి మూడు మ్యాచ్‌లు మాత్రమే తీసుకున్నాడు. చాలామంది బౌలర్లుకు గాయాలైన తర్వాత తమ రిథమ్‌ను అందుకోవడానికి  ఎక్కువ సమయే పడుతుంది. కానీ బుమ్రా తొందరగా పూర్తి స్వింగ్‌ను అందిపుచ్చుకున్నాడు. బుమ్రా ఎప్పుడూ డెత్‌ ఓవర్లలో 25-30 పరుగులు ఇచ్చి న దాఖలాలు లేవు. సైనీ, శార్దూల్‌లు మెరుగైన బౌలింగ్‌ వేసినా, టీమిండియా ఎక్స్‌ ఫ్యాక్టర్‌ మాత్రం బుమ్రానే’ అని అక్తర్‌ తెలిపాడు. (ఇక్కడ చదవండి: అదొక స్పెషల్‌ ఫీలింగ్‌.. సెకండ్‌ డ్రీమ్‌: రాహుల్‌)

>
మరిన్ని వార్తలు