రోహిత్‌పై పొగడ్తలు.. ఏకిపడేసిన ఫ్యాన్స్‌

10 Jul, 2018 12:32 IST|Sakshi

ఇంగ్లాండ్‌తో సిరీస్‌ నెగ్గిన టీమిండియాపై పలువురు ప్రముఖులు ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ కూడా రోహిత్‌ శర్మ ఇన్నింగ్స్‌పై పొగడ్తలు గుప్పించారు. రోహిత్‌ ఇన్నింగ్స్‌ ఔట్‌ స్టాండింగ్‌ అని అభివర్ణించారు. ఇది పాక్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌కు చిర్రెత్తుకొచ్చేలా చేసింది.

ట్రై సిరీస్‌లో భాగంగా ఆసీస్‌పై పాక్‌ గెలుపొందిన విషయం తెలిసిందే. అదే సమయంలో భారత్‌ కూడా ఇంగ్లాండ్‌పై టీ20 సిరీస్‌ నెగ్గింది. దీంతో ఈ రెండు విజయాలను ప్రస్తావిస్తూ అక్తర్‌ తన ట్విటర్‌లో ఓ పోస్టు ఉంచాడు. అయితే చివర్లో రోహిత్‌ పేరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ పొగడటంతో పాక్‌ ఫ్యాన్స్‌ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అక్తర్‌ ట్రోల్‌ చేస్తూ వరుసగా రీట్వీట్లు చేయటం ప్రారంభించారు. ఫఖర్‌ జమాన్‌ కూడా ఆస్ట్రేలియాపై అద్భుతంగా రాణించాడని, బహుశా అక్తర్‌ ఆ మ్యాచ్‌ చూసి ఉండకపోవచ్చనే కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఫఖర్‌ జమాన్‌ను పొగుడుతూ టీమిండియా మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ ఖైఫ్‌ చేసిన ట్వీట్‌కు ఇదే స్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.  కొందరైతే ఏకంగా ‘దేశద్రోహి’ అంటూ కైఫ్‌పై విరుచుకుపడ్డారు. మొత్తానికి ఈ ఇద్దరు మాజీలు అవతలి జట్టును, ఆటగాడిని పొగిడి విమర్శల పాలయ్యారు.

మరిన్ని వార్తలు