ఒలింపియా (గ్రీస్): కరోనా దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా జరగాల్సిన స్పోర్ట్స్ ఈవెంట్స్ వాయిదా పడుతుండటంతో ఒలింపిక్స్ అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయా అనే సందేహాల మధ్య ఒలింపిక్స్ తొలి ఘట్టాన్ని నిర్వహించారు. ఒలింపిక్స్ పుట్టినిల్లు ఒలింపియా నుంచి టోక్యో ఒలింపిక్ జ్యోతి తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఈ మేరకు జ్యోతి వెలిగించే కార్యక్రమం గురువారం జరిగింది. కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ప్రేక్షకులను అనుమతించలేదు. గ్రీస్ ఒలింపిక్ షూటింగ్ చాంపియన్ అన్నా కొరాక ఈ కార్యక్రమంలో పాల్గొంది. ఈ తరహాలో ఒక మహిళను జ్యోతి వెలిగించే కార్యక్రమంలో భాగం చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ జ్యోతి వారం రోజుల పాటు గ్రీసు దేశంలోని 37 నగరాలు, 15 చారిత్రక ప్రదేశాల మీదుగా... దాదాపు 3,500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. అనంతరం ఈ నెల 19న జపాన్లోని ఫుకుషిమాకు చేరుతుంది. అక్కడి నుంచి ఒలింపిక్స్ జరిగే టోక్యోకు చేరుతుంది.