థాంక్యూ చాంపియన్‌: బీసీసీఐ

21 Mar, 2020 13:09 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ కారణంగా వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా, లక్షల్లో దీని బారిన పడ్డారు. కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తుండటంతో అందరూ స్వీయ నిర్బంధంలో ఉండాలని ప్రభుత్వం సూచించింది. అత్యంత అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది. అయితే, ఏ పనీ లేకుండా ఇంటి పట్టున ఉండడం కొంత బోరింగే. క్రికెటర్లకు అయితే ఇది మహా బోరింగు వ్యవహారం. క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ అయితే ఈ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్న రాహుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. బ్యాట్‌తో బంతిని కొడుతూ, పుస్తకాలు చదువుతూ, ఐపాడ్‌లో పనిచేస్తూ ఇలా రకరకాలుగా గడుపుతూ కాలక్షేపం చేశాడు. పలు విధాలుగా చేసిన దానిని ఒక వీడియోగా ఎడిట్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఇది వైరల్‌గా మారింది. (మహ్మద్‌ కైఫ్‌ ట్వీట్‌పై మోదీ ఇలా..)

అయితే స్వీయ నిర్భందంలో ఉన్న  మరొక క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తనకు తెలిసిన ట్రిక్స్‌తో కాలక్షేపం చేస్తున్నాడు. దీనిలో భాగంగా హౌస్‌ మాజీషియన్‌గా మారిపోయి కార్డ్‌ ట్రిక్‌ షోను ప్రదర్శించాడు. దీనికి సంబంధించిన వీడియోను భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) తన అధికారిక ట్వీటర్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది. ఇలా కార్డ్‌ ట్రిక్‌ ద్వారా చేసిన షోతో అందరికీ నవ్వులు తెప్పించావు. థాంక్యూ చాంపియన్‌ అంటూ అని అయ్యర్‌ వీడియోకు  క్యాప్షన్‌ ఇచ్చింది. కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్‌ను వచ్చే నెల 15 వరకు బీసీసీఐ వాయిదా వేసింది. కానీ, అప్పుడైనా జరుగుతుందనే నమ్మకం లేదు. దీనిపై బీసీసీఐ సమాలోచనలు చేస్తుంటే క్రికెటర్లు మాత్రం హ్యాపీగా విశ్రాంతి తీసుకుంటున్నారు. స్వీయ నిర్భందంలోనే ఉంటూనే ఎంజాయ్‌ చేస్తూ అభిమానుల్ని అలరిస్తున్నారు. (ఐపీఎల్‌పై బీసీసీఐ ప్లాన్‌-బి ఇదేనా?)


 

మరిన్ని వార్తలు