అవధ్‌ వారియర్స్‌ను గెలిపించిన శుభాంకర్‌ డే

24 Jan, 2020 03:35 IST|Sakshi

చెన్నై: ఉత్కంఠ పోరులో అవధ్‌ వారియర్స్‌ ఆటగాడు శుభాంకర్‌ డే సత్తా చాటాడు. విజేతను నిర్ణయించే చివరి మ్యాచ్‌ బరిలో దిగిన అతను అద్భుతమైన ఆట తీరుతో మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. దాంతో ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) సీజన్‌–5లో గురువారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో అవధ్‌ వారియర్స్‌ 4–3తో నార్త్‌ ఈస్టర్న్‌పై గెలిచింది. తొలుత మిక్స్‌డ్‌ డబుల్స్‌లో బొదిన్‌ ఇసారా–కిమ్‌ హన (నార్త్‌ ఈస్టర్న్‌) ద్వయం 15–8, 11–15, 14–15తో కొ సుంగ్‌ హ్యూన్‌–క్రిస్టీనా (అవధ్‌  వారియర్స్‌) జోడీ చేతిలో ఓడింది. అనంతరం జరిగిన పురుషుల తొలి సింగిల్స్‌ పోరులో లే చెయుక్‌ యు (నార్త్‌ ఈస్టర్న్‌) 13–15, 15–10, 15–11తో విన్సెంట్‌ (అవధ్‌ వారియర్స్‌)పై గెలుపొందాడు.

ఈ మ్యాచ్‌లో నార్త్‌ ఈస్టర్న్‌ ‘ట్రంప్‌ కార్డు’తో ఆడటంతో ఆ జట్టుకు రెండు పాయింట్లు వచ్చాయి. దాంతో నార్త్‌ ఈస్టర్న్‌ 2–1తో ఆధిక్యంలో నిలిచింది. మూడో మ్యాచ్‌ అయిన మహిళల సింగిల్స్‌లో మిచెల్లె లీ (నార్త్‌ ఈస్టర్న్‌) 15–13, 15–14తో బీవెన్‌ జాంగ్‌ (అవధ్‌ వారియర్స్‌)ను కంగుతినిపించింది. పురుషుల డబుల్స్‌లో ‘ట్రంప్‌’ కార్డుతో బరిలో దిగిన అవధ్‌ వారియర్స్‌ జంట కొ సుంగ్‌ హ్యూన్‌– షిన్‌ బేక్‌ 8–15, 15–14, 15–12తో కృష్ణ ప్రసాద్‌– లీ యాంగ్‌ డే (నార్త్‌ ఈస్టర్న్‌) ద్వయంపై గెలువడంతో... ఇరు జట్ల స్కోర్లు 3–3తో సమం అయ్యాయి. ఇక విజేతను నిర్ణయించే చివరి పోరులో సెన్‌సోమ్‌బూన్‌సుక్‌ (నార్త్‌ ఈస్టర్న్‌) 9–15, 13–15తో  శుభాంకర్‌ డే చేతిలో ఓడటంతో... మ్యాచ్‌ అవధ్‌ వారియర్స్‌ వశం అయింది. నేటి మ్యాచ్‌లో బెంగళూరు రాప్టర్స్‌తో చెన్నై సూపర్‌స్టార్స్‌ తలపడుతుంది.   

మరిన్ని వార్తలు