-
వియత్నాం ఓపెన్ ఫైనల్లో జయరామ్
హో చి మిన్ సిటీ (వియత్నాం): ఈ సీజన్లో తొలి టైటిల్ సాధించే దిశగా భారత అగ్రశ్రేణి షట్లర్ అజయ్ జయరామ్ మరో అడుగు ముందుకేశాడు. వియత్నాం ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్–100 టోర్నమెంట్లో జయరామ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 93వ ర్యాంకర్ జయరామ్ 21–14, 21–19తో 49వ ర్యాంకర్, ఏడో సీడ్ యు ఇగారషి (జపాన్)పై గెలుపొందాడు. ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ 79వ ర్యాంకర్ రుస్తవిటో (ఇండోనేసియా)తో జయరామ్ తలపడతాడు.
మరో సెమీ ఫైనల్లో రుస్తవిటో 21–17, 19–21, 21–14తో భారత్కు చెందిన మిథున్ను ఓడించాడు. ఏడాది క్రితం 13 ర్యాంక్లో నిలిచిన జయరామ్ ఆ తర్వాత గాయం కారణంగా ఆరు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. ఫలితంగా అతని ర్యాంక్ పడిపోయింది. ఈ సంవత్సరం ఆరంభంలో పునరాగమనం చేసిన జయరామ్ ఎనిమిది టోర్నీలు ఆడాడు. వైట్ నైట్స్ ఓపెన్లో రన్నరప్గా నిలిచిన అతను యూఎస్ ఓపెన్లో సెమీఫైనల్లో నిష్క్రమించాడు.