ఆంధ్ర, త్రిపుర మ్యాచ్‌ ‘డ్రా’

13 Nov, 2017 04:46 IST|Sakshi

అగర్తల: ఆంధ్ర, త్రిపుర మధ్య హోరాహోరీగా సాగిన రంజీ ట్రోఫీ గ్రూప్‌ ‘సి’ సమరం చివరకు ‘డ్రా’గా ముగిసింది. మ్యాచ్‌ చివరి రోజు ఆదివారం ఆంధ్ర జట్టు దూకుడుగా ఆడి సవాల్‌ విసరగా... ఆ తర్వాత త్రిపుర కూడా లక్ష్య ఛేదనలో వెనకడుగు వేయలేదు. చివరకు వెలుతురులేమితో మ్యాచ్‌కు ముగింపు లభించింది. 322 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆట ముగిసే సమయానికి త్రిపుర 56 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ స్మిత్‌ పటేల్‌ (99 బంతుల్లో 107 నాటౌట్‌; 11 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడుగా ఆడి సెంచరీ చేయగా, ఉత్తమ్‌ బోస్‌ (46 బంతుల్లో 53; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. భార్గవ్‌ భట్‌కు 2 వికెట్లు దక్కాయి.

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 51/1తో ఆట కొనసాగించిన ఆంధ్ర తమ రెండో ఇన్నింగ్స్‌ను 4 వికెట్లకు 234 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. శ్రీకర్‌ భరత్‌ (50; 8 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా, అశ్విన్‌ హెబర్‌ (32 బంతుల్లో 44 నాటౌట్‌; 3 సిక్స్‌లు), సుమంత్‌ (42 బంతుల్లో 39 నాటౌట్‌; 3 ఫోర్లు), రికీ భుయ్‌ (43 బంతుల్లో 39; 4 ఫోర్లు, ఒక సిక్స్‌) రాణించారు. ఆంధ్ర 5.08 రన్‌రేట్‌తో పరుగులు చేయడం విశేషం. తాజా ఫలితంతో ఐదు మ్యాచ్‌ల తర్వాత 18 పాయింట్లతో ఆంధ్ర ఈ గ్రూప్‌లో అగ్రస్థానంలో ఉంది. తమ ఆఖరి మ్యాచ్‌లో ఆంధ్ర, ముంబైతో తలపడుతుంది. ఈ నెల 17 నుంచి సొంతగడ్డపై ఒంగోలులో జరిగే ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధిస్తే చాలు ఆంధ్ర క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.  

మరిన్ని వార్తలు