గ‘గన్‌’ గురికి రజత పతకం

3 Nov, 2017 00:09 IST|Sakshi

గోల్డ్‌కోస్ట్‌ (ఆస్ట్రేలియా): కామన్వెల్త్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. పోటీల మూడో రోజు భారత్‌ ఖాతాలో మూడు పతకాలు చేరాయి. పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌ ఈవెంట్‌లో హైదరాబాద్‌ షూటర్‌ గగన్‌ నారంగ్‌ రజతం నెగ్గగా... యువ షూటర్‌ స్వప్నిల్‌ కుసాలే కాంస్యం సాధించాడు. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌లో అన్నురాజ్‌ సింగ్‌ కాంస్యం కైవసం చేసుకుంది. ఫైనల్లో గగన్‌ 246.3 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానాన్ని సంపాదించగా... స్వప్నిల్‌ 225.6 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. ‘వచ్చే ఏడాది ఇక్కడే జరిగే కామన్వెల్త్‌ గేమ్స్‌కు ఇది టెస్ట్‌ ఈవెంట్‌. ఈ పోటీల ద్వారా ఇక్కడి పరిస్థితులపై అవగాహన కలిగింది.

ఫైనల్లో నేనింకా ఎక్కువ పాయింట్లు సాధించాల్సింది’ అని లండన్‌ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో కాంస్యం నెగ్గిన గగన్‌ వ్యాఖ్యానించాడు. 25 మీటర్ల పిస్టల్‌ ఫైనల్లో అన్నురాజ్‌ 28 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. భారత్‌కే చెందిన హీనా సిద్ధూ ఐదో స్థానంలో, రాహీ సర్నోబాత్‌ ఆరో స్థానంలో నిలిచారు. ఇప్పటివరకు ఈ పోటీల్లో భారత్‌కు మొత్తం పది పతకాలు లభించాయి.   

>
మరిన్ని వార్తలు