టైటిల్‌ పోరుకు సిరిల్‌ వర్మ 

16 Jun, 2019 13:53 IST|Sakshi

ఆలిండియా సీనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ఆలిండియా సీనియర్‌ ర్యాంకింగ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ ప్లేయర్‌ సిరిల్‌ వర్మ టైటిల్‌కు విజయం దూరంలో నిలిచాడు. విజయవాడలో జరుగుతోన్న ఈ టోర్నీలో సిరిల్‌ వర్మ ఫైనల్‌కు చేరుకున్నాడు. గురువారం పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో ఎనిమిదో సీడ్‌ సిరిల్‌ వర్మ 21–9, 21–18తో శంకర్‌ ముత్తుస్వామి (తమిళనాడు)పై విజయం సాధించాడు. అంతకుముందు క్వార్టర్స్‌ మ్యాచ్‌లో సిరిల్‌ 21–19, 21–7తో రోహిత్‌ యాదవ్‌ (తెలంగాణ)ను ఓడించాడు.

మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ ప్రీతి పోరు క్వార్టర్స్‌లోనే ముగిసింది. క్వార్టర్స్‌లో ప్రీతి 9–21, 12–21తో మూడో సీడ్‌ ఆకర్షి కశ్యప్‌ (ఏఏఐ) చేతిలో ఓడిపోయింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో ఆర్‌బీఐ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న హైదరాబాద్‌ అమ్మాయి మేఘన జక్కంపూడి తన భాగస్వామి ధ్రువ్‌ కపిలతో కలిసి ఫైనల్‌కు చేరుకుంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీఫైనల్లో టాప్‌ సీడ్‌ ధ్రువ్‌ కపిల (ఎయిరిండియా)–మేఘన ద్వయం 21–12, 21–12తో అరుణ్‌ జార్జ్‌ (కేరళ)–మహిమ (కర్ణాటక) జోడీపై గెలుపొందింది. పురుషుల డబుల్స్‌ క్వార్టర్స్‌ మ్యాచ్‌లో టాప్‌సీడ్‌ కృష్ణ ప్రసాద్‌ (ఏపీ)–ధ్రువ్‌ (ఎయిరిండియా) ద్వయం 21–12, 14–21, 21–14తో సంజయ్‌  (పాండిచ్చేరి)–సిద్ధార్థ్‌ (తెలంగాణ) జంటపై గెలుపొందింది. 
 

మరిన్ని వార్తలు