కోచ్‌లకు ‘కోచింగ్’

29 Dec, 2013 01:38 IST|Sakshi

తణుకు, న్యూస్‌లైన్: నైపుణ్యం గల కోచ్‌లు అందుబాటులో ఉంటేనే భవిష్యత్తులో ఏ క్రీడలోనైనా మంచి ఫలితాలు వస్తాయని భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మన దేశంలో కోచ్‌ల కొరత ఉన్నందున శిక్షణ ద్వారా వారిని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
 
  పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ కోచ్‌ల శిక్షణ శిబిరాన్ని ఆయన శనివారం ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 300 బ్యాడ్మింటన్ కోర్టులు అందుబాటులో ఉన్నా నైపుణ్యం కలిగిన కోచ్‌లు 50కి మించి లేరని గోపీచంద్ అన్నారు. బ్యాడ్మింటన్‌లో రాష్ట్రానికి చెందిన ఆటగాళ్లే అద్భుతంగా రాణిస్తున్నారని, భవిష్యత్తులోనూ ఇది కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు చోట్ల కోచ్‌లకు ఈ ప్రత్యేక శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నారు. బ్యాడ్మింటన్ క్రీడలో ఈ తరహాలో కోచింగ్ ఇవ్వడం దేశంలో ఇదే మొదటి సారి కావడం విశేషం. గతంలో చీరాలలో రెండు సార్లు శిబిరాలు జరిగాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ శిక్షణ అనంతరం ఆదివారం జరిగే ముగింపు కార్యక్రమంలో పురస్కారాలు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి కేసీ పున్నయ్యచౌదరి కూడా పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు