శ్రీలంక క్రికెట్‌ బోర్డుకు పీసీబీ వార్నింగ్‌!

15 Oct, 2019 11:20 IST|Sakshi

కరాచీ: ఇటీవల పాకిస్తాన్‌ పర్యటనకు వచ్చిన శ్రీలంక జట్టు మూడు వన్డేల సిరీస్‌ను కోల్పోగా, మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన సంగతి తెలిసిందే. శ్రీలంక సీనియర్‌ క్రికెటర్లు పాకిస్తాన్‌ పర్యటనకు వెళ్లమంటూ డుమ్మా కొట్టిన సందర్భంలో ‘జూనియర్‌’ జట్టునే పంపించి మరీ హుందాతనాన్ని చాటుకుంది ఎస్‌ఎల్‌సీ. కాగా, ఇప్పుడు శ్రీలంక క్రికెట్‌ జట్టుకు కొత్త చిక్కు వచ్చి పడింది. ఇరు దేశాల ద్వైపాక్షిక సిరీస్‌ల ఒప్పందంలో భాగంగా వచ్చే డిసెంబర్‌లో జరుగనున్న టెస్టు సిరీస్‌ కోసం పాకిస్తాన్‌లో శ్రీలంక క్రికెట్‌ జట్టు పర్యాటించాల్సి ఉంది. అయితే ఆ జట్టు వస్తుందా.. లేదా అనే సందిగ్థంతో ఉన్న పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు(పీసీబీ).. ముందుగానే బెదిరింపు చర్యలకు దిగింది.

ఒకవేళ పాక్‌ పర్యటనకు రాకుండా తటస్థ వేదికైన యూఏఈలో ఆ సిరీస్‌ను నిర్వహించాలని కోరితే మాత్రం అందుకు అయ్యే ఖర్చును ఎస్‌ఎల్‌సీ కూడా సమంగా భరించాలంటూ వార్నింగ్‌ ఇచ్చింది. ‘పాకిస్తాన్‌లో పర్యటించడానికి ఎటువంటి ఇబ్బందులు లేవు. మేము భద్రతా పరంగా అన్ని పటిష్టమైన ఏర్పాట్లు చేస్తాం. కొన్ని రోజుల క్రితం కరాచీ, లాహోర్‌ వేదికగా జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌ విజయవంతమైంది. అలా కాకుండా యూఏఈలో నిర్వహించాలని పట్టుబడితే మాత్రం శ్రీలంక క్రికెట్‌ బోర్డు కూడా అందుకు ఖర్చు అయ్యే వాటాను భరించాలి’ అని పీసీబీలో అధికారి ఒకరు తెలిపారు.

మరిన్ని వార్తలు