అలా ఐతే క్రికెట్లో మజా ఉండదు: గంభీర్

21 Mar, 2017 20:52 IST|Sakshi
అలా ఐతే క్రికెట్లో మజా ఉండదు: గంభీర్

న్యూఢిల్లీ: బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో ఇప్పటికే ఆస్ట్రేలియా-భారత్ జట్లు ఆటతో పాటు వివాదాలతోనూ ముందుకు సాగుతున్నాయి. ఈ విషయంపై టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. స్లెడ్జింగ్ అనేది ఆటలో తప్పదని వ్యాఖ్యానించాడు. దానివల్ల ఆటలో భిన్న మార్పులు చోటుచేసుకుంటాయని, కొన్ని సందర్భాలలో ఆసక్తికర అంశాలు జరుగుతాయని పేర్కొన్నాడు. బ్యాట్, బంతి వరకు మాత్రమే పరిమితమైతే క్రికెట్లో మజా ఉండదని, అయితే వ్యక్తిగత కక్ష పెంచుకునేందుకు మాత్రం పరిస్థితులు దారితీయకూడదని చెప్పాడు.

'ప్రత్యర్థి ఆటగాళ్ల ఏకాగ్రతను దెబ్బతీసేందుకు స్లెడ్జింగ్ చేయడంలో తప్పులేదు. ఎందుకంటే ఆటలో కాస్త మజా ఉండాలి. అయితే ఈ సిరీస్‌లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఔట్ విషయంలో డీఆర్ఎస్ రివ్యూ కోసం చేసిన తప్పిదంతో ఆట మరింత రసవరత్తరంగా మారింది. ఆటగాళ్లు రోబోలేం కాదు కనుక కొన్నిసార్లు స్లెడ్జింగ్ చేస్తారు. దేశం కోసం ఆడుతున్నప్పుడు కొన్ని బాధ్యతలు మోయాల్సి ఉంటుంది. అయితే ఏం చేసినా వ్యక్తిగత దూషణ చేయకుండా.. ఆటవరకే అది పరిమితం కావాలి. గత రెండు టెస్టులు క్రికెట్ అభిమానులకే కాదు.. తాజా, మాజీ క్రికెటర్లకు వినోద విందును రుచిచూపించాయి' అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

మరిన్ని వార్తలు