స్మిత్‌ అజేయ ద్విశతకం

17 Dec, 2017 01:07 IST|Sakshi

‘డబుల్‌’ దిశగా మిచెల్‌ మార్ష్‌

ఆస్ట్రేలియా 549/4

పెర్త్‌: ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ మూడో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు హవా కొనసాగిస్తోంది. ఓవర్‌నైట్‌ స్కోరు 203/3తో మూడో రోజు ఆట కొనసాగించిన ఆసీస్‌ రోజంతా బ్యాటింగ్‌ చేసి కేవలం ఒక్క వికెటే కోల్పోయి 346 పరుగులు చేయడంతో... జట్టు స్కోరు 549/4 కు చేరింది. కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (390 బంతుల్లో 229 బ్యాటింగ్‌; 28 ఫోర్లు, 1 సిక్స్‌), మిచెల్‌  (234 బంతుల్లో 181 బ్యాటింగ్‌; 29 ఫోర్లు) ఇంగ్లండ్‌ బౌలింగ్‌ను ఆటాడుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు అజేయంగా 301 పరుగులు జతచేశారు. ఇంగ్లండ్‌పై పెర్త్‌లో ఆస్ట్రేలియాకు ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. మూడో రోజు పడిన ఏకైక వికెట్‌ షాన్‌ మార్ష్‌ (28)ను మొయిన్‌ అలీ అవుట్‌ చేశాడు.

92 పరుగుల వ్యక్తిగత స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన స్మిత్‌ 138 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టు కెరీర్‌లో స్మిత్‌కు ఇది 22వ సెంచరీ. 58వ టెస్టు ఆడుతున్న స్మిత్‌ 107వ ఇన్నింగ్స్‌లో ఈ మార్క్‌ను చేరుకున్నాడు. గతంలో... బ్రాడ్‌మన్‌ (58 ఇన్నింగ్స్‌లు), గావస్కర్‌ (101 ఇన్నింగ్స్‌లు) మాత్రమే అతనికన్నా వేగంగా ఈ ఫీట్‌ సాధించారు. ప్రస్తుతం ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 146 ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 403 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు