అప్పుడు వెన్నులో వణుకు పుట్టింది: స్మిత్‌

2 Aug, 2019 15:34 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌:  ఇంగ్లండ్‌తో యాషెస్‌ సిరీస్‌లో భాగంగా గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌(144) భారీ సెంచరీ సాధించి జట్టును గాడిలో పెట్టాడు. ఆసీస్‌ వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో స్మిత్‌ సమయోచితంగా ఆడి శతకంతో మెరిశాడు. బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదం కారణంగా ఏడాది పాటు క్రికెట్‌కు దూరమైన అతడు ప్రపంచకప్‌ ద్వారా తిరిగి జట్టులో చేరాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో తొలి రోజు శతకంతో రాణించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌ జట్టుకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (2), బాన్‌క్రాఫ్ట్‌ (8), ఖవాజా (13) తక్కువ పరుగులకే వెనుతిరిగారు. స్టీవ్‌స్మిత్‌ ఆ సమయంలో బ్యాటింగ్‌కు రావడంతో కొందరు అభిమానులు అతడిని ఎగతాళి చేశారు. బాల్‌ టాంపరింగ్‌ వివాద సమయంలో స్మిత్‌ ఏడుస్తున్న ఫొటోలను మాస్కులుగా ధరించి అవహేళన చేశారు. ఆ అవమానాలను భరించిన అతడు క్రీజులో పాతుకుపోయి టెస్టు కెరీర్‌లో 24వ శతకం బాదాడు. దాంతో ఆసీస్‌ 284 పరుగుల స్కోరు చేయకల్గింది.

కాగా అతడు శతకం బాదగానే స్టేడియంలోని అభిమానులు ఒక్కసారిగా కరతాళ ధ్వనులతో చప్పట్లు కొట్టి అభినందించారు. మ్యాచ్‌ అనంతరం స్మిత్‌ మీడియాతో మాట్లాడుతూ.. తనకు డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆటగాళ్ల మద్దతు లభించిందనీ, అదే తనకు ముఖ్యమని తెలిపాడు. శతకం తర్వాత అభిమానులు చప్పట్లు కొడుతుంటే వెన్నులో వణుకు పుట్టిందని చెప్పాడు. టెస్టుల్లో చాలా రోజుల తర్వాత శతకం బాదడం ఆనందంగా ఉందని స్మిత్‌ అన్నాడు. అయితే ఏడాది పాటు ఆటకు దూరమైనప్పుడు ఒకానొక సమయంలో తనకు క్రికెట్‌పై ఇష్టం పోయిందన్నాడు. అసలు మళ్లీ క్రికెట్‌ ఆడతానని అనుకోలేదని స్మిత్‌ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు