ఇంగ్లండ్‌ లక్ష్యం 398

5 Aug, 2019 06:00 IST|Sakshi

స్మిత్, వేడ్‌ సెంచరీలు

ఆసీస్‌ 487/7 డిక్లేర్డ్‌

యాషెస్‌ తొలి టెస్టు

బర్మింగ్‌హామ్‌: ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ స్మిత్‌ (142; 14 ఫోర్లు), వేడ్‌ (110; 17 ఫోర్లు) శతక్కొట్టడంతో ఇంగ్లండ్‌ ముందు 398 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 124/3తో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఆసీస్‌ రెండో ఇన్నింగ్స్‌ను 112 ఓవర్లలో 487/7 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. తొలుత స్మిత్, ట్రావిస్‌ హెడ్‌ (51) నాలుగో వికెట్‌కు 130 పరుగులు జోడించారు. తర్వాత ఐదో వికెట్‌కు వేడ్, స్మిత్‌ జోడీ 126 పరుగులు జతచేసింది.

స్మిత్‌ యాషెస్‌ టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీ చేసిన ఐదో ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌గా ఘనతకెక్కాడు. గతంలో బార్డ్‌స్లే, మోరిస్, స్టీవ్‌ వా, హేడెన్‌ ఇలా రెండు సెంచరీలు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో స్టోక్స్‌ 3, మొయిన్‌ అలీ 2 వికెట్లు తీశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఇంగ్లండ్‌ ఆట నిలిచే సమయానికి 7 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 13 పరుగులు చేసింది. ఓపెనర్లు బర్న్స్‌ (7 బ్యాటింగ్‌), రాయ్‌ (6 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. చివరి రోజు ఇంగ్లండ్‌ నెగ్గాలంటే మరో 385 పరుగులు చేయాలి.  

మరిన్ని వార్తలు