భారత్‌ను గెలిపించిన పూనమ్, ఏక్తా

7 Apr, 2018 00:35 IST|Sakshi

తొలి వన్డేలో ఇంగ్లండ్‌ ఓటమి ∙రాణించిన స్మృతి మంధాన

నాగ్‌పూర్‌: గత ఏడాది ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో ఎదురైన ఓటమికి భారత మహిళల జట్టు బదులు తీర్చుకుంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో ఒక వికెట్‌ తేడాతో గెలుపొందింది. పూనమ్‌ యాదవ్, ఏక్తా బిష్త్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో భారత్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 49.3 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. పూనమ్‌  (4/30), ఏక్తా (3/49) ఇంగ్లండ్‌ను దెబ్బతీశారు.

అనంతరం భారత్‌ 49.1 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ స్మృతి మంధాన (86; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. 190/9తో ఓటమి అంచుల్లో ఉన్న భారత్‌ను ఏక్తా బిష్త్‌ (12 నాటౌట్‌), పూనమ్‌ యాదవ్‌ (7 నాటౌట్‌) గట్టెక్కించారు.  

మిథాలీ రికార్డు: ఈ మ్యాచ్‌తో భారత కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో అత్యధిక వన్డేలు (192) ఆడిన క్రీడాకారిణిగా ఘనత సాధించింది. ఈ రికార్డు గతంలో ఇంగ్లండ్‌కు చెందిన చార్లోటి ఎడ్వర్ట్స్‌ (191) పేరిట ఉంది.   

మరిన్ని వార్తలు