జడేజాను ముందే తీసుకోవాల్సింది!

10 Sep, 2018 09:10 IST|Sakshi
రవీంద్ర జడేజా

సోషల్‌ మీడియాలో ఈ ఆల్‌రౌండర్‌పే ప్రశంసల జల్లు

లండన్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌లో ఒంటరి పోరాటంతో భారత్‌ను గట్టెక్కించిన ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సామ్యానుడి నుంచి దిగ్గజాల వరకు అతని పోరాటాన్ని కొనియాడుతున్నారు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో టాప్‌ ఆర్డర్‌ చేతులెత్తేయగా.. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన జడేజా యువ ఆటగాడు విహారితో కలిసి 77 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను ఆదుకున్నాడు. విహారి వికెట్‌ అనంతరం అవతలి బ్యాట్స్‌మెన్‌కు అవకాశమివ్వకుండా డబుల్స్, బౌండరీలు బాదేందుకు ఉత్సాహం చూపాడు.

ఈ క్రమంలో 113 బంతుల్లో ఏడు ఫోర్ల సాయంతో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న జడేజా... ఇషాంత్‌ (4), షమీ (1), బుమ్రా (0) సాయంతో 55 పరుగులు జోడించడం విశేషం. దీంతోనే భారత్‌ 292 పరుగులు చేయగలిగింది. జడేజా (156 బంతుల్లో 86; 11 ఫోర్లు, 1 సిక్స్‌, నాటౌట్‌) ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌ ఆధిపత్యానికి గండిపడింది. ఇక అంతకు ముందు బంతితో నాలుగు వికెట్లు సాధించిన జడేజాను ముందు మ్యాచ్‌లే ఆడిపిస్తే సిరీస్‌ ఫలితం వేరేలా ఉండేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

జడేజా ఆటను టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ కొనియాడాడు. ‘వెల్‌డన్‌ జడేజా.. నీవు ముందే ఈ సిరీస్‌లో ఆడుంటే ఫలితం మరోలా ఉండేది. 4 వికెట్లతో పాటు అద్భత హాఫ్‌ సెంచరీ సాధించావు.. అలాగే రాణించు’  అని ట్విటర్‌లో ప్రశంసించాడు. ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌ మైకేల్‌ వాన్‌ సైతం జడేజా ప్రదర్శనను కొనియాడాడు. ‘ జడేజా ఆటతీరు ఆకట్టుకుంది. అన్ని సమయాల్లో అతన్ని ఆడించాలని భారత్‌ ఎలా గ్రహిస్తుందో.. గొప్ప నైపుణ్యం కలిగిన ఆటగాడు’ అని ట్వీట్‌ చేశారు. భారత ఆటగాళ్లు ఆర్పీసింగ్‌ సైతం బంతితో, బ్యాట్‌తో రాణించిన జడేజాను కొనియాడాడు. ఇక ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌ కుదురుగా ఆడుతోంది. ఆదివారం ఆట ముగిసే సమయానికి రెండో వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది.  

చదవండి: ఎటువైపో ఈ ‘టెస్టు’ 

మరిన్ని వార్తలు