వాషింగ్టన్: పూర్తి ఫిట్నెస్ను సంతరించుకున్న భారత టెన్నిస్ స్టార్ సోమ్దేవ్ దేవ్వర్మన్ మళ్లీ ఏటీపీ సర్క్యూట్లో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. సిటీ ఓపెన్-500 టోర్నమెంట్లో సోమ్దేవ్ రెండో రౌండ్లో ఏకంగా డిఫెండింగ్ చాంపియన్, తొమ్మిదో సీడ్ అలెగ్జాండర్ డల్గొపొలోవ్ (ఉక్రెయిన్)ను బోల్తా కొట్టించాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన రెండో రౌండ్లో ప్రపంచ 129వ ర్యాంకర్ సోమ్దేవ్ 6-3, 7-6 (7/4)తో ప్రపంచ 25వ ర్యాంకర్ డల్గొపొలోవ్ను ఓడించాడు. 81 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సోమ్దేవ్ ఏకంగా తొమ్మిది ఏస్లు సంధించాడు. మరోవైపు డల్గొపొలోవ్ ఎనిమిది డబుల్ ఫాల్ట్లు చేశాడు.
మ్యాచ్ మొత్తంలో ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసిన భారత నంబర్వన్ తన సర్వీస్ను ఒక సారి కోల్పోయాడు. క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లోకి అడుగుపెట్టిన సోమ్దేవ్ గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్, ప్రపంచ 20వ ర్యాంకర్ జాన్ ఇస్నెర్ (అమెరికా)తో తలపడతాడు. ‘చాలా సంతోషంగా ఉన్నాను. డల్గొపొలోవ్ క్లిష్టమైన ప్రత్యర్థి అనడంలో సందేహం లేదు. నేను చాలా బాగా ఆడాను. ఆద్యంతం నా సర్వీస్ బాగుంది. ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్తో ఉన్నాను’ అని 28 ఏళ్ల సోమ్దేవ్ అన్నాడు.