రెండో రౌండ్‌లో సౌజన్య, ప్రాంజల 

7 Mar, 2018 09:00 IST|Sakshi
సౌజన్య భవిశెట్టి, ప్రాంజల యడ్లపల్లి

 ఐటీఎఫ్‌ మహిళల టోర్నీ  

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) మహిళల టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారులు ముందంజ వేశారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరుగుతోన్న ఈ టోర్నీలో తెలంగాణకు చెందిన సౌజన్య భవిశెట్టి, ప్రాంజల యడ్లపల్లి సింగిల్స్‌లో రెండో రౌండ్‌కు... డబుల్స్‌లో క్వార్టర్స్‌కు చేరుకున్నారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలిరౌండ్‌లో సౌజన్య (భారత్‌) 6–1, 6–0తో దీక్ష మంజు ప్రసాద్‌ (భారత్‌)పై గెలుపొందగా... మూడో సీడ్‌ ప్రాంజల 6–3, 6–3తో యుబ్రాని బెనర్జీ (భారత్‌)ను ఓడించింది.

డబుల్స్‌ తొలిరౌండ్‌లో సౌజన్య–రిషిక సుంకర (భారత్‌) ద్వయం 7–5, 6–2తో అద్రిజ బిశ్వాస్‌–ఆర్తి మునియన్‌ (భారత్‌) జోడీపై నెగ్గింది. మరో మ్యాచ్‌లో ప్రాంజల (భారత్‌)–ఎమిలీ వెబ్లీ స్మిత్‌ (గ్రేట్‌ బ్రిటన్‌) జంట 6–2, 6–0తో నిత్య రాజ్‌–సౌమ్య (భారత్‌) జోడీపై గెలుపొంది క్వార్టర్స్‌కు చేరుకుంది. మరోవైపు సింగిల్స్‌ తొలి రౌండ్‌లో నిధి చిలుముల (తెలంగాణ) 2–6, 4–6తో ఐదోసీడ్‌ ఫ్రేయ క్రిస్టీ (గ్రేట్‌ బ్రిటన్‌) చేతిలో, రిషిక సుంకర 6–7 (10/12), 0–6తో నుడిడా లాంగ్నమ్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో, భువన కాల్వ (తెలంగాణ) 5–7, 4–6తో తెరీజా మిహలికోవా (స్లొవేకియా) చేతిలో పరాజయం పాలయ్యారు. ఇతర డబుల్స్‌ మ్యాచ్‌ల్లో నిధి చిలుముల–స్నేహాదేవి రెడ్డి (భారత్‌) జంట 7–6 (7/5), 7–5తో మోనికా రాబిన్‌సన్‌ (అమెరికా)–జో వెన్‌ స్కాండలిస్‌ (భారత్‌) జోడీపై గెలుపొందింది.   

మరిన్ని వార్తలు