ఈరోజు దాదాకెంతో ప్రత్యేకం..!

22 Jun, 2020 12:31 IST|Sakshi

కోల్‌కతా: భారత క్రికెట్‌ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న సౌరవ్‌ గంగూలీకి ఈ రోజెంతో ప్రత్యేకం. 1996 జూన్‌ 22న టెస్టుల్లో అరంగేట్రం చేసిన సౌరవ్‌.. తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో ఆకట్టుకున్నాడు. లార్డ్స్‌ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో అతను 131 పరుగులు సాధించాడు. టీమిండియా బౌలర్‌ వెంకటేష్‌ ప్రసాద్‌ ఐదు వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 344 పరుగులకు ఆలౌట్‌ అయింది. తర్వాత బ్యాటింగ్‌ చేపట్టిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్‌ వికెట్‌ కోల్పోయింది. మూడో స్థానంలో వచ్చిన లెఫ్టార్మ్‌ బ్యాట్స్‌మన్‌ సౌరవ్‌ 310 బంతుల్లో 131 పరుగులు చేసి వెనుదిరిగాడు. వాటిలో 20 బౌండరీలు ఉండటం విశేషం. 
(చదవండి: దాదా ఇంట్లో మరో ఇద్దరికి కరోనా)

రాహుల్‌ ద్రవిడ్‌తో కలిసి 94 పరుగులు జోడించిన అనంతరం జట్టు స్కోరు 296 పరుగుల వద్ద సౌరవ్‌ ఆరో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. అప్పటికీ ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది. ఇక ద్రవిడ్‌కు కూడా ఇదే తొలి టెస్టు మ్యాచ్‌ కావడం మరో విశేషం. అయితే, 95 పరుగుల వద్ద ఔటైన ద్రవిడ్‌ సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. మొత్తం మీద 429 పరుగుల చేసిన టీమిండియా 85 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ 278 పరుగుల చేసి మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. 2019 అక్టోబర్‌లో సౌరవ్‌ గంగూలీ బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టిన సంగతి తెలిసిందే.
(చదవండి: ‘అది గంగూలీకి గుర్తుందో లేదో’)

మరిన్ని వార్తలు