ముంబై : భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడిగా టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముంబైలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ కొత్త బాస్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో దిగ్గజ క్రికెటర్గా, సమర్థవంతమైన కెప్టెన్గా టీమిండియాకు పలు చిరస్మరణీయ విజయాలు అందించిన గంగూలీ.. బోర్డు పగ్గాలు చేపట్టిన రెండవ క్రికెటర్గా ఘనత సాధించారు. గంగూలీకి ముందు 1954–56 మధ్య కాలంలో మహరాజా ఆఫ్ విజయనగరం (పూసపాటి విజయానంద గజపతి రాజు) బోర్డు అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఇక 2014 ఐపీఎల్ బాధ్యతలు చూడమంటూ సునీల్ గావస్కర్ను సుప్రీం కోర్టు తాత్కాలికంగా అధ్యక్షుడిగా నియమించిన విషయం తెలిసిందే.(చదవండి : ‘విజ్జీ’ తర్వాత...గంగూలీ)
ఇదిలా ఉండగా... ఎన్నికయిన నూతన కార్యవర్గం బోర్డులో పూర్తిస్థాయి పాలన పగ్గాలు చేపట్టనుంది. దీంతో సుప్రీం కోర్టు నియమించిన పరిపాలక కమిటీ (సీఓఏ)కి నేటితో శుభం కార్డు పడినట్లైంది. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జై షా బోర్డు కార్యదర్శి పదవికి నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.