కోల్కతా : టీ20లకు సీనియర్ వికెట్ కీపర్, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనిని దూరం పెట్టడంపై అతని అభిమానులు సెలక్టర్లపై భగ్గుమంటున్న విషయం తెలిసిందే. అయితే మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాత్రం ధోనిని దూరం పెట్టడం తనకేం ఆశ్చర్యం అనిపించలేదని, అతన్ని తీసేయడంలో తప్పులేదని అభిప్రాయపడ్డాడు.
మంగళవారం ఓ జాతీయ ఛానల్తో మాట్లాడుతూ.. ‘టీ20లకు ధోనిని ఎంపికచేయకపోవడం పట్ల నేనేమి ఆశ్చర్యానికి గురికాలేదు. ఎందుకంటే అతని ప్రదర్శన అంత గొప్పగా ఏమి లేదు. ధోని 2020 టీ20 వరల్డ్కప్ వరకు జట్టులో ఉంటాడని అనుకోవట్లేదు. అందుకే సెలక్టర్లు మంచి ఫామ్లో ఉన్న రిషభ్ పంత్కు అవకాశం ఇస్తున్నారు. 2019 వన్డే ప్రపంచకప్ వరకు సెలక్టర్లు ధోనికి అవకామిస్తేనే ఎక్కువగా భావిస్తా. వెస్టిండీస్తో చివరి వన్డే అనంతరం ధోని ఆటకు చాలా గ్యాప్ వస్తుంది. అతను డొమెస్టిక్ క్రికెట్ ఆడడు.
మళ్లీ ఆసీస్, న్యూజిలాండ్లతో వన్డే సిరీస్ల్లోనే ఆడుతాడు. అతన్ని రంజీ ట్రోఫీలు ఆడామని సెలక్టర్లు సూచించాలి. దీంతో ఆటతో టచ్లో ఉంటాడు. ఇది అతని ఫామ్ తిరిగి సాధించడానికి ఉపయోగపడుతోంది. ఎంత పెద్ద ఆటగాడైనా.. రోజు ఆడకపోతే.. ఆటపై ఉన్న పట్టు కోల్పోతాడు’ అని గంగూలీ చెప్పుకొచ్చాడు. ఇక ఎమ్మెస్కే ప్రసాధ్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ వెస్టిండీస్, ఆస్ట్రేలియాలతో జరిగే టీ20 సిరీస్లకు ధోనిని పక్కకు పెడుతు భారత జట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.