సఫారీ ఆటగాళ్లంతా సేఫ్‌ 

4 Apr, 2020 03:30 IST|Sakshi

జొహన్నెస్‌బర్గ్‌: భారత పర్యటనకు వచ్చి... మహమ్మారి దెబ్బకు ఒక్క మ్యాచ్‌ అయినా ఆడకుండానే దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు గత నెల తిరుగుముఖం పట్టింది. అయితే భారత్‌ నుంచి స్వదేశం చేరిన సఫారీ ఆటగాళ్లలో ఎవరికీ కరోనా లక్షణాలు లేవని ఇక్కడ నిర్వహించిన పరీక్షల్లో తేలింది. ప్రొటీస్‌ ఆటగాళ్లు మార్చి 18న దక్షిణాఫ్రికా చేరారు. వీళ్లందరిని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచగా... గురువారంతో ఈ స్వీయ నిర్బంధం ముగిసింది. అనంతరం కరోనా పరీక్షలు చేయగా రిపోర్టులన్నీ నెగెటివ్‌గానే వచ్చాయని శుక్రవారం జట్టు చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ శుయబ్‌ మంజ్రా తెలిపారు. వీళ్ల నిర్బంధం ముగిసినా మరో రెండు వారాలు ఎక్కడికీ వెళ్లే అవకాశాల్లేవు. ఎందుకంటే దక్షిణాఫ్రికాలోనూ 21 రోజుల లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాలో 1400 మందికిపైగా కరోనా బారిన పడగా... ఐదుగురు మృతి చెందారు.

మరిన్ని వార్తలు