కనికాకు కరోనా.. సఫారీ ఆటగాళ్లలో గుబులు

22 Mar, 2020 20:11 IST|Sakshi

సాక్షి, లక్నో: ఇటీవలే లండన్‌ నుంచి భారత్‌కు వచ్చిన బాలీవుడ్‌ సింగర్‌ కనికా కపూర్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలిన విషయం తెలిసిందే. అయితే కనికాకు కరోనా సోకిన విషయం తెలియడంతో దక్షిణాఫ్రికా క్రికెటర్లుకు గుబులు పట్టుకుంది. ఎందుకంటే కనికా లండన్‌ నుంచి నేరుగా లక్నోలోని ఓ హోటల్‌లోకి దిగింది. అయితే ఇదే సమయంలో వన్డే సిరీస్‌ కోసం దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఆ హోటల్‌లోనే బస చేశారు. అయితే వన్డే సిరీస్‌ రద్దు కావడంతో లక్నో నుంచి కోల్‌కతా మీదుగా సఫారీ క్రికెటర్లు తమ దేశానికి వెళ్లారు. అయితే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా భారత్‌ నుంచి వచ్చిన తమ దేశ క్రికెటర్లను సెల్ఫ్‌ ఐసోలేషన్‌(స్వీయ నిర్బంధం)లో ఉండమని ఆ దేశ క్రికెట్‌ బోర్డు ఆదేశించింది. అయితే తాము బస చేసిన హోటల్‌లోనే కనిక కపూర్ స్టే చేసి ఉండటంతో ఇప్పుడు దక్షిణాఫ్రికా క్రికెటర్లలో టెన్షన్ మొదలైంది.   

ఇంతకీ ఏం జరిగిందంటే..
లండన్‌ నుంచి వచ్చిన బాలీవుడ్‌ సింగర్‌ కనికా కపూర్‌ లక్నో లోని ఓ స్టార్‌ హోటల్లో బస చేసింది. అంతేకాకుండా తన కుటుంబసభ్యులు, స్నేహితులకు గ్రాండ్‌గా పార్టీ ఇచ్చారు. ఈ విందుకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అయితే కనికాకు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ విందులో ఎవరెవరు పాల్గొన్నరనే దానిపై వివరాలు సేకరిస్తోంది. అంతేకాకుండా హోటల్‌ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి కరోనా టెస్టులు నిర్వహించింది. ఇదే క్రమంలో ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కావడంతో రెండో వన్డే కోసం భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు లక్నో చేరుకున్నాయి. 

అయితే కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో వన్డే సిరీస్‌ను బీసీసీఐ రద్దు చేసింది. దీంతో కోహ్లి అండ్‌ గ్యాంగ్‌ ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు. కానీ దక్షిణాఫ్రికా క్రికెటర్లు మాత్రం రెండు రోజులు లక్నోలోనే ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే సఫారీ క్రికెటర్లు స్వదేశం వెళ్లాలంటే అత్యంత సమీప అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీకి వెళ్లి అటు నుంచి దక్షిణాఫ్రికా బయల్దేరాలి. కానీ ఢిల్లీలో కరోనా వైరస్‌ విస్తరిస్తోందంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో డి కాక్‌ బృందం దేశ రాజధాని వెళ్లడానికి నిరాకరించింది. దీంతో కరోనా అంతగా ప్రభావం లేని కోల్‌కతా నుంచి దుబాయ్‌కు చేరుకొని కనెక్టింగ్‌ ఫ్లైట్‌లో స్వదేశానికి వెళ్లిపోయారు. అయితే ఈ రెండు రోజులు కనికా బస, పార్టీ చేసుకున్న హోట్‌లోనే తాము ఉన్నామన్న వార్త తెలుసుక్ను సఫారీ క్రికెటర్లు నిర్ఘాంతపోయినట్టు సమాచారం.  

చదవండి:
‘కనికా కపూర్‌ ఓ రోగిలా ప్రవర్తించాలి’
మార్చి 31 వరకు తెలంగాణ లాక్‌డౌన్‌

మరిన్ని వార్తలు